హోరాహోరీ మ్యాచ్లకు దీటుగా ఐపీఎల్ 2024 వేలం కొనసాగుతోంది. ఫ్రాంచైజీలు కోరుకున్న ఆటగాళ్ల కోసం పడిన పోటీ చూస్తుంటే ప్రేక్షకుల్లో హై టెన్షన్ మొదలైంది. అయితే ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా ప్లేయర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ భారీ ధర పలికారు. ఐపీఎల్ చరిత్రలోనే రూ.20 కోట్లకు పైగా ధరను సొంతం చేసుకున్న ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు. వీరిద్దరు కలిసి ఏకంగా రూ.45.25 కోట్ల ధర పలకడం విశేషం.
ఇక ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇస్తున్న మిచెల్ స్టార్ ఆల్టైమ్ రికార్డు ధర పలికాడు. రూ24.75 కోట్లకు అతడిని కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. స్టార్క్ కోసం గుజరాత్ టైటాన్స్, కోల్కతా తీవ్రంగా పోటీపడ్డాయి. వారు పోటీ పడుతుంటే మిగిలిన ఫ్రాంచైజీలు ఏం చేయాలేని పరిస్థితులో ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే ఇతర ఫ్రాంచైజీల దగ్గర ఉన్న డబ్బులు దాటి స్టార్క్ కోసం గుజరాత్, కోల్కతా పోటీపడ్డాయి. మొత్తంగా కోల్కతా స్టార్క్ను సొంతం చేసుకుంది.

అంతకుముందు కమిన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. రూ. 2 కోట్ల బేస్ ప్రైజ్తో వేలంలోకి వచ్చిన కమిన్స్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి.ఇరు ఫ్రాంచైజీలు తగ్గేదేలే అన్నట్లు పోటీపడటంతో కమిన్స్ ధర అమాంతం పెరిగిపోయింది. చివరకు సన్రైజర్స్ కమిన్స్ను దక్కించుకుంది.
స్టార్క్, కమిన్స్ రికార్డు ధరతో గతంలో ఉన్న అత్యధిక ధర రూ.18.50 కోట్ల రికార్డు బద్దలైంది. గత వేలంలో పంజాబ్ కింగ్స్ సామ్ కరణ్ను రూ. 18.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. కాగా, స్టార్క్ 2015లో చివరిసారిగా ఐపీఎల్ ఆడాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున స్టార్క్ ఆడాడు.