ఐపీఎల్ మినీ వేలం ఆసక్తికరంగా సాగింది. కోరుకున్న ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఈ క్రమంలో రికార్డు ధరలు నమోదయ్యాయి.ఆస్ట్రేలియా ప్లేయర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ భారీ ధర పలికారు. ఐపీఎల్ చరిత్రలోనే రూ.20 కోట్లకు పైగా ధరను సొంతం చేసుకున్న ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు.మిచెల్ స్టార్క్ ఆల్టైమ్ రికార్డు ధర పలికాడు. రూ24.75 కోట్లకు అతడిని కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. కమిన్స్కు సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లు వెచ్చించింది.
అయితే కొంత మంది స్టార్ ప్లేయర్లపై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్,హేజిల్వుడ్; దక్షిణాఫ్రికా ప్లేయర్లు వాండర్ డసెన్, షంసి; ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఆదిల్ రషీద్, ఫిలిప్ సాల్ట్ ; న్యూజిలాండ్ ప్లేయర్లు జేమ్స్ నీషమ్, బ్రేస్వెల్, జేమీసన్, సోధి; అలాగే శ్రీలంక ప్లేయర్లు కుశాల్ మెండిస్ తదితర ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. వీరికి భారీ డిమాండ్ ఉంటుందని భావిస్తే అన్సోల్డ్గా మిగిలిపోయారు.

ఐపీఎల్ వేలం రెండు రోజుల ముందు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్ మెరుపు శతకం బాదాడు. వెస్టిండీస్తో జరిగిన మూడో టీ20లో 56 బంతుల్లో 109 పరుగులు చేశాడు. ఇక వేలం ముగిసిన తర్వాత ప్రారంభమైన నాలుగో టీ20లోనూ సాల్ట్ సెంచరీ సాధించాడు. 57 బంతుల్లో ఏకంగా 119 పరుగులు చేశాడు. మరోవైపు భారత్తో జరిగిన టీ20 సిరీస్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ జోస్ ఇంగ్లిస్ కూడా సెంచరీ కొట్టాడు.
వీరిద్దరు ఐపీఎల్ వేలానికి ముందు సెంచరీలు సాధించినా ఏ ఫ్రాంచైజీలు ఆసక్తిచూపకపోవడం గమనార్హం. బౌలర్లు, ఆల్రౌండర్లు కావాలనే ప్లాన్తో ఫ్రాంచైజీలు రావడంతో వీరికి నిరాశ మిగిలింది. మరో ప్రధాన కారణం వీరిద్దరు వికెట్ కీపర్లు కావడం. ఫ్రాంచైజీలు వికెట్ కీపర్ కోసం ఆసక్తి చూపలేదు. బ్యాకప్ వికెట్ కీపర్ కోసం తీసుకోవాలని కొన్ని జట్లు ప్రయత్నించినా భారత వికెట్ కీపర్ కోసం ట్రై చేశాయి. దీంతో సెంచరీలతో సత్తాచాటినా అన్సోల్డ్గా మిగిలారు.