వన్డే వరల్డ్ కప్లో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర సత్తాచాటిన సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్లో 25 ఏళ్ల వయసు లోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డులకెక్కాడు. మెగాటోర్నీలో 10 మ్యాచ్ల్లో 64 సగటుతో 578 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ వేలంలో అతడికి భారీ డిమాండ్ ఉంటుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే అన్ని ఫ్రాంచైజీలు అతడిపై ఆసక్తి కనబరిచిచే అవకాశాలు ఉన్నా చెన్నై సూపర్ కింగ్స్కు వేరే ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తోంది.
రేపు జరగనున్న ఐపీఎల్ మినీ వేలానికి చెన్నై పర్స్లో రూ.31.4 కోట్లు ఉన్నాయి. ఆ జట్టులో ఆరు ఖాళీలు ఉండగా, విదేశీ ప్లేయర్లకు మూడు స్లాట్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వారి దగ్గర టాప్ ఆర్డర్ బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్, కాన్వే, అజింక్య రహానె, షేక్ రషీద్ ఉన్నారు. ఆల్రౌండర్లుగా జడేజా, దూబే, మొయిన్ అలీతో పాటు అజయ్ మండల్, నిశాంత్ సింధు ఉన్నారు. ఇక స్పిన్నర్లుగా మిచెల్ సాంట్నర్, తీక్షణ, ప్రశాంత్; ఫాస్ట్ బౌలర్లుగా దీపక్ చాహర్,ముకేశ్,పతిరనా,తుషార్,సిమర్జిత్, రాజవర్థన్ ఉన్నారు. ఫినిషర్గా ధోనీ జట్టుతో ఉన్నాడు.

బెన్ స్టోక్స్ను వదులుకోవడంతో సీఎస్కే పర్స్లోకి పెద్దమొత్తంలో మనీ వచ్చాయి. అయితే అంబటి రాయుడు జట్టుకు దూరమవ్వడమే చెన్నైకు కష్టంగా మారింది. గత సీజన్లో టాప్ ఆర్డర్ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో రచిన్ రవీంద్రను తీసుకుంటే టాప్ ఆర్డర్లో మార్పులు చేయాల్సి వస్తుందని, రాయుడు స్థానంలో అనుభవం ఉన్న మిడిలార్డర్ ప్లేయర్ను తీసుకోవాలని చెన్నై ప్లాన్ చేస్తుంది.
మరోవైపు స్పిన్ ఆల్రౌండర్ను కాకుండా ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్ను తీసుకోవాలని చెన్నై ప్రణాళిక రచిస్తోంది. జడేజా, మొయిన్ అలీ స్పిన్ ఆల్రౌండర్లుగా రాణిస్తుండటంతో రచిన్ జట్టులోకి వస్తే సమతూకం దెబ్బతింటుందని భావిస్తోంది. అలాగే విదేశీ పేసర్ను తీసుకోవాలని ప్లాన్ చేస్తుంది.
చెన్నై తీసుకోవాలనుకునే ఆటగాళ్లు వీరే: మనీష్ పాండే, జోష్ హేజిల్వుడ్, కొయెట్జీ, డారిల్ మిచెల్, డేనియల్ సామ్స్, జేసన్ హోల్డర్, హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, షారుక్ ఖాన్, హార్విక్ దేశాయ్