Yuzvendra Chahal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్ మెగా ఆక్షన్ రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజుల పాటు సాగే మెగా ఆక్షన్ ఇది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీల అధినేతలు ఈ వేలానికి హాజరయ్యారు. తొలి రోజున 84 మంది ప్లేయర్లు రేసులో నిలిచారు. వారికోసం వేలం సాగుతోంది.

రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ జాక్ పాట్ కొట్టాడు. కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయడు. ఏకంగా 18 కోట్ల రూపాయలకు అతన్ని కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు చాహల్.
2022 నుంచీ ఈ టీమ్తో అసోసియేట్ అయి ఉన్నాడు. 2024 సీజన్లో అద్భుతంగా రాణించాడు. మొత్తం 15 మ్యాచ్లల్లో 18 వికెట్లను పడగొట్టి తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఐపీఎల్లో 200 వికెట్లను పడగొట్టిన మొట్టమొదటి బౌలర్ చాహలే.
ఈ సీజన్ కోసం అతన్ని జట్టులోకి తీసుకుంది పంజాబ్ కింగ్స్. తొలుత చాహల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ పోటీ పడ్డాయి. ఆ తరువాత డ్రాప్ అయ్యాయి. దీనితో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోటీ నెలకొంది. నాణ్యమైన్ స్పిన్ బౌలర్ కోసం పోటీపడ్డ పీబీకేఎస్.. అతన్ని సొంతం చేసుకుంది.