Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్ మెగా ఆక్షన్ రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజుల పాటు సాగే మెగా ఆక్షన్ ఇది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీల అధినేతలు ఈ వేలానికి హాజరయ్యారు. తొలి రోజున 84 మంది ప్లేయర్లు రేసులో నిలిచారు. వారికోసం వేలం సాగుతోంది.

ఈ వేలం పాటలో మీడియం పేస్ బౌలర్ హర్షల్ పటేల్ను తీసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్. ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయలను అతని కోసం ఖర్చు పెట్టింది. పంజాబ్ కింగ్స్తో పోటీ పడి మరీ దక్కించుకుంది. తొలుత 6.75 కోట్ల రూపాయలతో హర్షల్ను కొనుగోలు చేసింది ఎస్ఆర్హెచ్.
ఆ తరువాత రైట్ టు మ్యాచ్ కార్డ్ను ప్రయోగించింది పంజాబ్ కింగ్స్. దీనితో అతని రేటును మరింత పెంచింది కావ్యా మారన్. ఎనిమిది కోట్ల వరకూ వెళ్లింది ప్రైస్. ఆ అమౌంట్ వద్ద ఇక పీబీకేఎస్ పోటీపడలేకపోయింది. దీనితో హర్షల్ను సన్రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకోగలిగింది.
ఐపీఎల్లో అద్భుతంగా రాణస్తోన్నాడు హర్షల్. నిఖార్సయిన టీ20 స్పెషలిస్ట్ బౌలర్. 2024 సీజన్లో 24 వికెట్లు పడగొట్టాడంటే అతని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. రెండుసార్లు పర్పుల్ క్యాంప్ను దక్కించుకున్నాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఆడిన 105 మ్యాచ్లల్లో 135 వికెట్లు కూల్చాడు. 5/27 అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్.
టీ20 వరల్డ్ కప్ 2022 ఆడిన భారత జట్టులో మెంబర్. ఇప్పటివరకు 25 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు గానీ ఐపీఎల్లో ప్రదర్శించిన దూకుడును అక్కడ కొనసాగించలేకపోయాడు. స్లోయర్, కట్టర్స్ డెలివరీలో హర్షల్ పటేల్ ప్రధాన అస్త్రాలు. పరిస్థితులకు అనుగుణంగా బంతులను సంధించే నైపుణ్యం ఉందతనికి.