Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్ మెగా ఆక్షన్ రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజుల పాటు సాగే మెగా ఆక్షన్ ఇది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీల అధినేతలు ఈ వేలానికి హాజరయ్యారు. తొలి రోజున 84 మంది ప్లేయర్లు రేసులో నిలిచారు. వారికోసం వేలం సాగుతోంది.

ఈ వేలం పాటలో నిఖార్సయిన టీ20 స్పెషలిస్టులను సెలెక్ట్ చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో మెరుపులు మెరిపించగల ప్లేయర్లకు జట్టులో చోటు కల్పించింది. నలుగురు స్పెషలిస్టుల కోసం ఏకంగా 43.75 కోట్ల రూపాయలను గుమ్మరించింది.
ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్ను అందుకోని ఫ్రాంఛైజీల్లో ఇదీ ఒకటి. ఈ సాలా కప్ నమ్దే అంటూ అభిమానులను ఊరించడం.. చివరికి ఉసూరుమనిపించడం ఈ జట్టుకు అలవాటైపోయింది. ఈ దఫా మాత్రం ఈ వైఫల్యాలకు పుల్స్టాప్ పెట్టాలనే పట్టుదలతో ఉంది టీమ్ కూర్పు చూస్తోంటే.
ఈ మెగా ఆక్షన్లో టీ20 స్పెషలిస్టులు వికెట్ కీపర్ బ్యాటర్లు లియామ్ లివింగ్స్టొన్, జితేష్ శర్మతో పాటు డాషింగ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్, పేస్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ను పిక్ చేసింది. ఇంగ్లాండ్కు చెందిన లియామ్ లివింగ్స్టొన్- రూ.8.75 కోట్లు, ఫిల్ సాల్ట్- 11.50 కోట్లు, టీమిండియా ప్లేయర్ జితేష్ శర్మ- 11 కోట్లు, ఆస్ట్రేలియాకు చెందిన హేజిల్వుడ్- 12.50 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది.
వీళ్ల చేరికతో బ్యాటింగ్ ఆర్డర్ బలపడినట్టే. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పటిదార్, లియామ్ లివింగ్స్టొన్, జితేష్ శర్మ.. వంటి మెరికలతో జట్టు బలంగా కనిపిస్తోంది. కోల్కత నైట్ రైడర్స్ ఓపెనర్గా ఫిల్ సాల్ట్, పంజాబ్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాటర్గా లివింగ్స్టొన్.. ఏ స్థాయిలో ఆడారో తెలిసిందే.