KL Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్ మెగా ఆక్షన్ రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజుల పాటు సాగే మెగా ఆక్షన్ ఇది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీల అధినేతలు ఈ వేలానికి హాజరయ్యారు. తొలి రోజున 84 మంది ప్లేయర్లు రేసులో నిలిచారు. వారికోసం వేలం సాగుతోంది.

ఈ వేలం పాటలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేెఎల్ రాహుల్ భారీ రేటుకు సోల్డ్ అవుట్ అయ్యాడు. అతన్ని ఢిల్లీ కేపిటల్స్ కొనుగోలు చేసింది. 14 కోట్ల రూపాయలను ధార పోసింది. లక్నో సూపర్ జెయింట్స్లో ఆడుతున్న ఈ కన్నడిగుడు.. డీసీకి కేప్టెన్గా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది.
రిషభ్ పంత్ను రిలీజ్ చేసిన నేపథ్యంలో ఢిల్లీ కేపిటల్స్కు ఓ సారథి అవసరం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ హోదా కోసం కేఎల్ రాహుల్ను సమర్థుడిగా భావించినట్టుంది. 2022లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ టీమ్ను బ్యాక్ అండ్ బ్యాక్ సీజన్లల్లో ప్లేఆఫ్స్కు చేర్చిన ఘనత అతనికి ఉంది.
2022, 2023 సీజన్లల్లో లక్నో సూపర్ జెయింట్స్ను సక్సెస్ఫుల్గా నడిపించాడు. 2024లో అతని మేజిక్ పని చేయలేదు. పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది ఎల్ఎస్జీ. అదే సమయంలో ఫ్రాంఛైజీ ఓనర్ సంజీవ్ గోయెంకాతో వాగ్వివాదానికి దిగడమూ అతనికి మైనస్ పాయింట్గా మారింది. 2025 సీజన్ కోసం ఆక్షన్కు వచ్చిన కేఎల్ రాహుల్ను ఢిల్లీ కేపిటల్స్ ఎగరేసుకెళ్లింది.
నిజానికి- తన హోమ్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వస్తాడనే అంచనాలు ఉండేవి. ఎల్ఎస్జీ రిలీజ్ చేసిన తరువాత కేఎల్ రాహుల్ సైతం ఇదే విషయాన్ని ఒకట్రెండు సందర్భాలు ప్రస్తావించాడు కూడా. ఆర్సీబీ సైతం అతన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపినప్పటికీ అది వాస్తవరూపాన్ని దాల్చలేకపోయింది.