Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్ మెగా ఆక్షన్ రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజుల పాటు సాగే మెగా ఆక్షన్ ఇది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీల అధినేతలు ఈ వేలానికి హాజరయ్యారు. తొలి రోజున 84 మంది ప్లేయర్లు రేసులో నిలిచారు. వారికోసం వేలం సాగుతోంది.

ఈ వేలం పాటలో టీ20 స్పెషలిస్ట్ శ్రేయాస్ అయ్యర్ రికార్డు రేటుకు అమ్ముడుపోయాడు. 26.75 కోట్ల రూపాయలకు అతన్ని జట్టులోకి తీసుకుంది పంజాబ్ కింగ్స్. అతని ఛాయిస్తో ఈ జట్టుకు కేప్టెన్ కొరత తీరిపోయినట్టయింది. ఆక్షన్ ప్రైస్.. 25 కోట్ల రూపాయలను దాటినపటికీ డోంట్ కేర్ చెప్పింది పంజాబ్ కింగ్స్. కేప్టెన్సీ ట్యాగ్ కోసమే అయ్యర్ను అంత ధర పెట్టి కొనుగోలు చేసింది.
2024 సీజన్ వరకూ అతను కోల్కత నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యాన్ని వహించాడు. ఈ సీజన్లో జట్టును ఛాంపియన్గా నిలిపాడు. కప్ను ముద్దాడాడు. అదే ఆశ ఇప్పుడు పంజాబ్ కింగ్స్లోనూ ఉంది. కప్ను అందుకోవాలనే చిరకాల కోరికను శ్రేయాస్ అయ్యర్ నెరవేర్చగలడని భావించింది.
మెగా ఆక్షన్లో రికార్డు ధర పలకడం పట్ల శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. పంజాబ్ కింగ్స్ ఫ్యామిలీలో చేరడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఫ్రాంఛైజీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోనని అన్నాడు. ఇంత భారీ ధర వస్తుందని ఊహించలేదని చెప్పుకొచ్చాడు.
ఇప్పటి దాకా ఐపీఎల్ ఛాంపియన్షిప్గా నిలవని జట్లల్లో పంజాబ్ కింగ్స్ ఒకటి. 2008 నుంచీ ఇఫ్పటివరకు ఈ జట్టు ఒక్కసారి కూడా కప్ను గెలవలేదు. ఈ సారి ఆ కలను నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. కోల్కత నైట్ రైడర్స్ తరహాలోనే తమనూ ఛాంపియన్గా నిలుపుతాడని ఆశిస్తోంది.