Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్ మెగా ఆక్షన్ రసవత్తరంగా సాగుతోంది. రెండు రోజుల పాటు సాగే మెగా ఆక్షన్ ఇది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీల అధినేతలు ఈ వేలానికి హాజరయ్యారు. తొలి రోజున 84 మంది ప్లేయర్లు రేసులో నిలిచారు. వారికోసం వేలం సాగుతోంది.

ఈ వేలం పాటలో తమిళనాడుకు చెందిన టీ నటరాజన్ భారీ రేటుతో అమ్ముడుపోయాడు. 10.75 కోట్ల రూపాయలతో అతన్ని జట్టులోకి తీసుకుంది ఢిల్లీ కేపిటల్స్. 2024 సీజన్ వరకూ సన్రైజర్స్ హైదరాబాద్లో కొనసాగాడు. 2017లో ఐపీఎల్లో అడుగు పెట్టిన అతను తొలుత కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆ తరువాత ఎస్ఆర్హెచ్తో అసోసియేట్ అయ్యాడు.
ఈ దఫా అతన్ని రిలీజ్ చేసింది మేనేజ్మెంట్. ఈ మెగా ఆక్షన్లో టీ నటరాజన్ కోసం భారీ పోటీ నెలకొంది. చివరికి- 10.75 కోట్ల రూపాయలతో ఢిల్లీ కేపిటల్స్ దక్కించుకుంది. 2018లో 40 లక్షలతో సన్రైజర్స్లో చేరిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ శాలరీ 2022లో నాలుగు కోట్ల రూపాయలకు పెరిగింది.
ఇప్పుడు 10 కోట్ల రూపాయల మార్క్ దాటింది. 2024 సీజన్లో 19 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్లల్లో ఒకడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 61 మ్యాచ్లను ఆడిన టీ నటరాజన్ 67 వికెట్లు తీసుకున్నాడు. 4/19 అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్.