ఐపీఎల్ 2024 వేలం ఎవరి ఊహలకు అందట్లేదు. ఫ్రాంచైజీలు అంచనాలకు భిన్నంగా ప్లేయర్లను కొనుగోలు చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ధర పలికిన ఆటగాడిగా ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు. రూ.20.5 కోట్లకు కమిన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. కనీస ధర రూ. 2 కోట్లుగా వేలంలో నిలిచిన కమిన్స్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డాయి.
అయితే గత సీజన్ వేలంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపని డారిల్ మిచెల్ ఈ సారి సత్తాచాటాడు. మిచెల్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి. ఆఖరి వరకు మిచెల్ కోసం నిలిచిన చెన్నై రూ.14 కోట్లు వెచ్చించింది. 2023 సీజన్లో అన్సోల్డ్గా నిలిచిన మిచెల్ ఈ సారీ భారీ ధరను అందుకోవడం విశేషం. ఇటీవల భారత్లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో డారిల్ మిచెల్ 9 ఇన్నింగ్స్లో 69 సగటుతో 552 పరుగులు చేశాడు. 111 స్ట్రైక్రేట్తో ఆడాడు. భారత్ పిచ్లపై దూకుడుగా రాణించడంతో అతడికి ఈ వేలంలో డిమాండ్ భారీగా పెరిగింది.

మిచెల్ కంటే ముందు చెన్నై మరో ఇద్దరు స్టార్ ప్లేయర్లను వేలంలో కొనుగోలు చేసింది. బేసిక్ ప్రైజ్ రూ.50 లక్షలతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.1.80 కోట్లకు దక్కించుకుంది. టాప్ ఆర్డర్లో పరుగుల వరద పారించే సత్తా ఉన్న రచిన్ బౌలింగ్ కూడా చేయగలడు.
టీమిండియా స్టార్ ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ తిరిగి చెన్నై గూటికి చేరుకున్నాడు. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలో బరిలోకి దిగిన శార్దూల్ను చెన్నై రూ.4 కోట్లకు దక్కించుకుంది.బౌలింగ్తో పాటు భారీ షాట్లు ఆడగలిగే సత్తా శార్దూల్కు ఉంది.
అయితే డారిల్ మిచెల్, రచిన్ చేరికతో చెన్నై జట్టులో న్యూజిలాండ్ ప్లేయర్ల సంఖ్య నలుగురికి చేరింది. ఇప్పటికే సీఎస్కే జట్టులో కాన్వాయ్, మిచెల్ శాంట్నర్ ఉన్నారు.