
ధనాధన్ క్రికెట్ ఐపీఎల్ అంటే గుర్తొచ్చే స్టార్ బ్యాట్స్మెన్లలో ఒకరు క్రిస్ గేల్.ఈ కరేబియన్ ఆటగాడు బరిలో అడుగుపెడితే చాలు ఆ ఊపు ఉత్సాహమే వేరు. క్రిస్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు పరుగుల సునామీనే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అవతల బౌలర్ ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే..బంతి మాత్రం బౌండరీ వైపు వెళ్లాల్సిందే. తొలినాళ్లలో ఐపీఎల్లో ఓ ఊపు ఊపిన క్రిస్ గేల్ ఆ తర్వాత ఫామ్ కోల్పోయాడు. రకరకాల సమస్యలతో బ్యాటింగ్ పై ఫోకస్ చేయలేకపోయాడు. అయితే తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని చాటేందుకు ఈ కరేబియన్ స్టార్ క్రికెటర్ మళ్లీ రెడీ అవుతున్నాడు. ఈ సారి ఐపీఎల్ నుంచి క్రిస్ గెయిల్ తప్పుకుంటున్నాడన్న వార్తలు వచ్చాయి. అయితే తిరిగి ఐపీఎల్లో కనిపిస్తాడనే ప్రచారమూ జరుగుతోంది. ఇంతకీ ఈ కన్ఫ్యూజన్ ఏంటో మనమూ ఓ లుక్కేద్దాం.
ఐపీఎల్ 2023 మినీ ఆక్షన్ను జియో సినిమా ప్లాట్ఫార్మ్ పై స్ట్రీమింగ్ కానుంది. కొచ్చి వేదికగా జరిగే ఈ మినీ వేలంపాటను జియో సినిమా బ్రాడ్కాస్ట్ చేయనుంది. ఇప్పటికే 400 మంది ప్లేయర్ల పేర్లు వేలంపాట జాబితాలో ఉన్నాయి. అయితే ఇందులో క్రిస్ గేల్ పేరు కనిపించలేదు. అయినప్పటికీ ఈ బ్యాటింగ్ సునామీ ఐపీఎల్తో కనెక్ట్ అవుతారంటూ జియో సినిమా ఓ ట్వీట్ వేసింది. దీంతో మళ్లీ క్రిస్ గేల్ రీఎంట్రీపై చర్చ ప్రారంభమైంది.

క్రిస్ గేల్ రీఎంట్రీ అంటూ జియో సినిమా చేసిన ట్వీట్తో ఇటు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. క్రిస్ గేల్ బ్యాటింగ్ను మళ్లీ ఐపీఎల్లో చూడలేమనుకున్నవారికి ఒక్కింత ఆశ కల్పించినట్లయ్యింది. అయితే ట్వీట్ చివరిలో జియో సినిమా అసలు విషయం చెప్పేయడంతో ఫ్యాన్స్ మళ్లీ డిస్సపాయింట్ అయ్యారు. డిసెంబర్ 23వ తేదీన జరిగే ఐపీఎల్ మినీ వేలంను జియో సినిమా బ్రాడ్ కాస్ట్ చేస్తోంది. అయితే ఈ షోలో క్రిస్ గేల్ ఒక గెస్ట్గా పాల్గొంటున్నట్లు వెల్లడించింది. జియో సినిమా ఊరించి ఊసూరుమనిపించడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.

ఇక ఈ ఆల్టైమ్ గ్రేట్ బ్యాట్స్మెన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బంతిని స్టేడియం అవతలకు బాదడంలో గేల్ దిట్ట. ఐపీఎల్లో ఒక లెజెండ్గా మిగిలిపోయాడు క్రిస్ గేల్. మొత్తం మూడు ఫ్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహించిన క్రిస్ గేల్.. తన ఐపీఎల్ ప్రస్థానం కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో ప్రారంభించి అందులో మూడు సీజన్ల వరకు ఉన్నాడు. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జతకట్టిన గేల్ పరుగుల సునామీని సృష్టించాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టులో చేరి రెండు సీజన్లు ఆడాడు.

గేల్ వ్యక్తిగత కెరీర్ విషయానికొస్తే వెస్టిండీస్ రెండు సార్లు టీట్వంటీ విజేతగా నిలిస్తే రెండిటిలోను తాను జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ పక్కన పెడితే మరికొన్ని పొట్టి ఫార్మాట్ క్రికెట్లో గేల్ తన సత్తా చాటుతున్నాడు. టీట్వంటీ క్రికెట్లో 450 మ్యాచుల్లో 14వేల పరుగులు చేసి ఈ తరహా ఫార్మాట్లో టాప్ ప్లేస్లో నిలిచాడు ఈ కరేబియన్ కింగ్. ఈ సారి జరిగే ఐపీఎల్లో ప్రత్యక్షంగా బరిలోకి దిగనప్పటికీ.. ఏదో రకంగా ప్రేక్షకుల ముందుకు క్రిస్గేల్ వస్తాడనే ప్రచారం జరుగుతోంది.