
మెగా ఆక్షన్..
ఈ టోర్నమెంట్లో ఆడబోయే క్రికెటర్ల కోసం మెగా వేలంపాట ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. ఆదివారం కూడా కొనసాగుతుంది. బెంగళూరు- ఈ మెగా ఆక్షన్కు ఆతిథ్యాన్ని ఇచ్చింది. హోటల్ ఐటీసీ గార్డెనియాలో ఈ వేలం పాటను నిర్వహించనున్నారు.
లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా ఐపీఎల్ టోర్నమెంట్లో జాయిన్ అయ్యాయి. ఈ రెండు జట్లు ముగ్గురు ప్లేయర్ల చొప్పున రిటైన్ చేసుకున్నాయి. కొత్త వారి కోసం వేలంపాటలో పాల్గొనబోతోన్నాయి.

కొత్త ఫ్రాంఛైజీల బ్యాక్గ్రౌండ్ ఏంటీ..?
లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కొత్తగా ఐపీఎల్ టోర్నమెంట్లో జాయిన్ అయ్యాయి. ఈ రెండింటి రాకతో ఫ్రాంఛైజీల సంఖ్య 10కి పెరిగింది. దీనితోపాటు మ్యాచ్ల సంఖ్య కూడా. ఈ రెండు ఫ్రాంఛైజీల రాకతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు అంచనాలకు మించిన ఆదాయం లభించింది. నిర్దారించిన బేస్ ప్రైస్ కంటే రెట్టింపు ఆదాయం బీసీసీఐ ఖజానాకు చేరింది. ఈ రెండు ఫ్రాంఛైజీలు చెల్లించిన అమౌంట్.. అన్నింటి కంటే ఎక్కువే.

అదానితోనే పోటీ..
అహ్మదాబాద్కు చెందిన సీవీసీ కేపిటల్.. గుజరాత్ టైటన్స్ ఫ్రాంఛైజీ ఓనర్. ఐపీఎల్ మెగా టోర్నమెంట్లో ఎంట్రీ ఇవ్వడానికి భారీగా ఖర్చు చేసింది. బీసీసీఐ బేస్ ప్రైజ్ కంటే 160 శాతం అధికంగా బిడ్డింగులను దాఖలు చేసింది. దీని విలువ 5,625 కోట్ల రూపాయలు. ఇది కాస్తా పోటీ కంపెనీ, దేశీయ పారిశ్రామిక దిగ్గజం అదాని గ్రూప్ను సైతం వెనక్కి నెట్టింది. అదాని వేసిన బిడ్డింగ్ ప్రైజ్ విలువ 5,100 కోట్ల రూపాయలు. అదాని కంటే అధికంగా బిడ్ను కోట్ చేసినందున.. సీవీసీ కేపిటల్కు ఫ్రాంఛైజీ దక్కింది.

హార్దిక్ పాండ్యా కేప్టెన్గా..
ఎంట్రీతోనే సంచలనంగా మారిన గుజరాత్ కేపిటల్స్.. ప్రస్థానం కూడా అదే స్థాయిలో సాగుతోంది. రిటెన్షన్ సందర్భంగా ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుంది. సారథ్య బాధ్యతలను అప్పగించింది. అతనికి 15 కోట్ల రూపాయలకు చెల్లించనుంది. సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్కు జట్టులో చోటు కల్పించింది. 15 కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. కోల్కత నైట్ రైడర్స్ ఓపెనర్ శుభ్మన్ గిల్పైనా కన్నేసింది. ఎనిమిది కోట్ల రూపాయలతో జట్టులోకి తీసుకుంది.

రూ.52 కోట్లతో..
ప్రస్తుతం గుజరాత్ టైటన్స్ ఫ్రాంఛైజీ వద్ద 52 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉంది. ఈ మొత్తంతో 22 మంది క్రికెటర్లను కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందులో ఎనిమిది మంది విదేశీ ప్లేయర్లు. దీనికోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్- సంజీవ్ గోయెంకాకు చెందిన ఫ్రాంఛైజీ. దీనికోసం ఆర్సీ-సంజీవ్ గోయెంకా కంపెనీ బీసీసీఐకి చెల్లించిన బిడ్డింగ్ ప్రైస్ 5,000 కోట్ల రూపాయలు పైమాటే.

కేఎల్ రాహుల్ కేప్టెన్సీలో..
కేఎల్ రాహుల్ను 17 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అతనితో పాటు మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్ను జట్టులోకి తీసుకుంది. లక్నో టీమ్కు కేఎల్ రాహుల్ కేప్టెన్గా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్ వద్ద 57 కోట్ల రూపాయల మొత్తం మిగిలివుంది. దీనితో జట్టును సమకూర్చుకోనుంది. ఏడు మంది విదేశీ క్రికెటర్లను కలుపుకొని మొత్తం 22 మంది ప్లేయర్లను జట్టులోకి తీసుకోనుంది.


Click it and Unblock the Notifications












