
ఐపీఎల్ సంగ్రామం కంటే ముందు జరిగే మరో వేడుక మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ కాన్సెప్ట్కే ముఖ్యమైన వేడుక ఇది. అదే ఆటగాళ్ల వేలం. అవును ఐపీఎల్ 2021 సీజన్కు ఆటగాళ్ల వేలంపాట ఈ రోజు జరగనుంది. దీన్నే మినీ ఆక్షన్గా పిలుస్తున్నారు. మొత్తం 292 మంది ఆటగాళ్లకు వేలం పాట నిర్వహించనున్నారు. వీరికోసం 8 ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. అయితే ఐపీఎల్ అభిమానులు మాత్రం తాము మద్దతుగా నిలిచే జట్టులోకి ఎవరు వస్తారా అనే ఆతురతతో ఎదురుచూస్తున్నారు. ఇక ఐపీఎల్ వేలంపాట జరగాలంటే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఒకరుంటారు. ఈ రోజు వేలంపాటను ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరు..? ఆయన గురించి తెలుసుకుందాం..
ఐపీఎల్ మినీ వేలం సందడి ప్రారంభమైంది. చెన్నై వేదికగా గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే ఈ మొత్తం కార్యక్రమాన్ని నడపనున్నారు హ్యూ ఎడ్మీడ్స్. ఈయన పలు అంతర్జాతీయ వేలంపాటను ముందుండి నడిపించిన అనుభవం ఉంది. 35 ఏళ్ల తన కెరీర్లో 2500 ఆక్షన్స్ నిర్వహించిన అనుభవం హ్యూ ఎడ్మీడ్స్కు ఉంది. 2018లో ఎడ్మీడ్స్ను బీసీసీఐ ఐపీఎల్ ఆక్షనీర్గా ఎంపిక చేసింది. రిచర్డ్ మాడ్లీ తర్వాత ఆ స్థానంలో గుర్తింపు పొందిన రెండో వ్యక్తిగా ఎడ్మీడ్స్ నిలిచారు.ఇక అంతర్జాతీయ స్థాయిలో జరిగే వేలంపాటలు నిర్వహించిన అనుభవం ఎడ్మీడ్స్ సొంతం. ఇందులో భాగంగా పెయింటింగ్స్, ఫైన్ ఫర్నిచర్, సెరామిక్స్, మరియు ఆర్ట్ వర్క్స్, ఫిల్మ్ మరియు స్పోర్టింగ్లకు సంబంధించిన వస్తువులకు వేలంపాట నిర్వహించిన ఎక్స్పీరియన్స్ ఎడ్మీడ్స్కు ఉంది.
ఇక ఫిబ్రవరి 18న జరగనున్న వేలంపాటకు మొత్తం 292 మంది ఆటగాళ్ల జాబితా సిద్ధంగా ఉంది. ఇందులో నుంచి 61 ప్లేయర్స్కు మాత్రమే అవకాశం ఉంది. అంటే ఆయా జట్లు తమ అవసరాలకు అనుగుణంగా ఈ 61 ప్లేయర్ల కోసం వేలంపాటలో పోటీపడతాయి. ఈ మొత్తం 292 మంది ప్లేయర్లలో భారత క్రికెటర్లు 164 మంది ఉండగా 125 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. మరో ముగ్గురు అనుబంధ దేశాల నుంచి ఉన్నారు.
ఈ వేలంపాటకు చాలా మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఆయా జట్ల యాజమానులు, పారిశ్రామికవేత్తలు, సినిమా స్టార్లు, రాజకీయనాయకులతో పాటు వ్యూహకర్తలు, మాజీ ఆటగాళ్లు, కోచ్లు, మరియు ఈవెంట్ విశ్లేషకులు హాజరుకానున్నారు. వీరందిరిలో కెల్లా హ్యూ ఎడ్మీడ్స్ అనే ఈ వ్యక్తి మాత్రమే ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. ఎందుకంటే గంట కొట్టి ప్రారంభించాల్సింది ఇతనే కాబట్టి. హ్యూ ఎడ్మీడ్స్ ఈ మొత్తం కార్యక్రమానికి మాస్టర్గా వ్యవహరించనున్నారు. కొన్ని వందల పేర్లను వేలంపాట సందర్భంగా ఆయన పలకనున్నారు. అనంతరం ఫలానా ప్లేయర్ ఏ జట్టు కొనపుగోలు చేసింది, ఎంతకు కొనుగోలు చేసిందో గంట కొట్టి ప్రకటిస్తారు. మొత్తానికి మినీ వేలం ఒక మినీ ఫెస్టివల్ను తలపించనుంది.