
కోల్కతా: ఐపీఎల్-2020 ఆటగాళ్ల వేలం కోల్కతా వేదికగా జరుగుతోంది. ఇప్పటికే కొందరు ఆటగాళ్లకు ఫ్రాంఛైజీలు భారీ మొత్తం పోసి కొనుగోలు చేశారు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్కు వేలంలో భారీ ధర పలికింది. కింగ్స్ పంజాబ్ ఫ్రాంఛైజీ మ్యాక్స్వెల్ను 10. 75 కోట్లకు దక్కించుకుంది. ఇతని కనీస ధర రూ. 2 కోట్లు. మ్యాక్సీ కోసం పలు ఫ్రాంఛైజీలు పోటీపడగా చివరకూ పంజాబ్ సొంతం చేసుకుంది.
మరో ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ అరోన్ ఫించ్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఫించ్ కనీస ధర 1 కోటి ఉండగా.. రూ. 4.40 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. ఫించ్ కోసం కోల్కతా, బెంగళూరు ఫ్రాంఛైజీల మధ్య హోరాహోరీ నడిచింది. కనీస ధర రూ. 2కోట్లతో వేలంలోకి వచ్చిన ఫ్యాట్ కమిన్స్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడ్డాయి. అయితే, చివరకు ప్యాట్ కమిన్స్ను అర్సీబీ సొంతం చేసుకుంటుందనే సమయంలో రేసులోకి కేకేఆర్ దూసుకొచ్చింది. దీంతో చివరకు ప్యాట్ కమిన్స్ను కేకేఆర్ రూ. 15.50 కోట్లకు కొనుగోలు చేసింది.
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు శామ్ కర్రన్ను రూ. 5.5 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ వేలంలో సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్ మోరిస్ను వేలంలో రూ. 10 కోట్లు పెట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. అయితే యూసఫ్ పఠాన్, కోలిన్ డీ గ్రాండ్హోమ్లను ఏ ప్రాంఛైజీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.
పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా)- రూ.15.50 కోట్లు-కోల్కతా
మ్యాక్స్వెల్ (ఆస్ట్రేలియా)- రూ10.75 కోట్లు-పంజాబ్
క్రిస్ మెరిస్ (దక్షిణాఫ్రికా)- రూ.10 కోట్లు-బెంగళూరు
ఇయాన్ మోర్గాన్ ( ఇంగ్లాండ్)- రూ.5.25 కోట్లు-కోల్కతా
ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)- రూ.4.40 కోట్లు-బెంగళూరు
రాబిన్ ఊతప్ప (భారత్)- రూ.3 కోట్లు-రాజస్థాన్
క్రిస్ లిన్ (ఆస్ట్రేలియా)- రూ.2 కోట్లు-ముంబై
జాసన్ రాయ్ (ఇంగ్లాండ్)- రూ.1.50 కోట్లు- ఢిల్లీ