
కోల్కతా: 2020 ఐపీఎల్ వేలం కొనసాగుతోంది. ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్ల కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ అత్యధిక ధర పలికాడు. కోల్కతా నైట్ రైడర్స్ రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ రూ.10.75 కోట్లు పెట్టి కొనుక్కుంది. దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10 కోట్లకు దక్కించుకుంది. ఇంగ్లాండ్ పేసర్ సామ్ కరన్ను చెన్నై సూపర్ కింగ్స్ 5.50 కోట్లకు కొనుగోలుచేసింది.
ఇక ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ను కోల్కతా నైట్ రైడర్స్ రూ.5.25 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో ప్రస్తుత కెప్టెన్ దినేశ్ కార్తీక్ స్థానంలో మోర్గాన్ కేకేఆర్ పగ్గాలు చేపట్టనున్నాడన్న వార్తలు వచ్చాయి. అయితే కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్పందించి ఈ వార్తలకు ఫుల్స్టాప్ పెట్టాడు. మోర్గాన్ను భారీ ధరకు కొనుగోలు చేసినా.. కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీకే అని స్పష్టం చేశాడు.
ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఫించ్ కోసం కేకేఆర్ తీవ్రంగా పోటీపడినప్పటికీ.. చివరికి ఆర్సీబీ దక్కించుకుంది. ఫించ్ కనీస ధర 1 కోటి ఉండగా.. రూ. 4.40 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. కర్ణాటకకు చెందిన వరుణ్ చక్రవర్తి కోసం కేకేఆర్, ఆర్సీబీ పోటీపడ్డాయి. అయితే చివరకు అతడిని రూ. 4 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది. కనీస ధరతో వేలంలోకి వచ్చిన సిద్ధార్ధ్ను కోల్కతా వేలంలో కొనుగోలు చేసింది.
ఐపీఎల్ వేలంలో యూసుఫ్ పఠాన్కు తీవ్ర నిరాశ ఎదురైంది. కొనుగోలు చేసేందుకు ఎవరూ బిడ్ దాఖలు చేయలేదు. ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీకి కూడా నిరాశ తప్పలేదు. అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఇక న్యూజిలాండ్ ఆల్రౌండర్ కొలిన్ డి గ్రాండ్ హోమ్కు కూడా వేలంలో చుక్కెదురైంది. అతడిని కొనుగోలు కోసం ఎవరూ బిడ్ దాఖలు చేయలేదు.
ఎవిన్ లూయిస్, మనోజ్ తివారి, కొలిన్ ఇన్గ్రామ్, మార్టిన్ గుప్టిల్, కార్లోస్ బ్రాత్వైట్, మార్కస్ స్టోయినిస్, ఆండిల్ ఫెలుక్వాయో, కొలిన్ మున్రో, రిషి ధావన్, బెన్ కటింగ్లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. బరీందర్ శ్రణ్, అన్రిచ్ నోర్ట్జి, మార్క్ వుడ్(ఇంగ్లాండ్), అల్జారి జోసెఫ్(వెస్టిండిస్), ముస్తాపిజుర్ రెహ్మాన్(బంగ్లాదేశ్), ఆడమ్ మిల్నే(న్యూజిలాండ్) లకు నిరాశే ఎదురైంది.