
హైదరాబాద్: ఇటీవల విడుదలైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నేపథ్య గీతంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ఐపీఎల్ నేపథ్య గీతంను కాపీ చేయలేదని, చాలా కస్టపడి స్వయంగా రూపొందించా అని ఐపీఎల్ గీతం రూపకర్త ప్రణవ్ అజయ్ రావ్ మాల్ప్ పేర్కొన్నారు. తన పాటను కాపీ చేసి దీనిని రూపొందించారని ర్యాపర్ కృష్ణ కౌల్ చేసిన ఆరోపణలను అతడు ఖండించారు. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2020 ప్రారంభం కానుంది.
ఇటీవల ఐపీఎల్ 2020 నేపథ్య గీతాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితులను మేళవిస్తూ ఈ పాటను రూపొందించారు. కరోనా కారణంగా అంతా మారిపోయింది. ముఖాలకు మాస్కులు, ఒకరికొకరు దూరం, అవసరానికి మించి చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు రుద్దుకోవడం, స్వేచ్ఛగా బయటకు వెళ్లలేకపోవడం, పనులు చేసుకోలేకపోవడం వంటి అంశాలను పాటలో ఉంచారు.
మళ్లీ ప్రజలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఐపీఎల్ వచ్చేసిందంటూ.. 'ఆయేంగే హమ్ వాపస్'ను రూపొందించారు. తన పాటను కాపీ చేసి దీనిని రూపొందించారని ర్యాపర్ కృష్ణ కౌల్ ఆరోపిస్తున్నారు. 2017లో తాను రూపొందించిన 'దేఖ్ కౌన్ ఆయా వాపస్'కు ఇది కాపీ అని అతడు అంటున్నాడు. అయితే కృష్ణ కౌల్ ఆరోపణలను ఐపీఎల్ గీతం రూపకర్త ప్రణవ్ అజయ్ రావ్ మాల్ప్ తాజాగా ఖండించారు. ఐపీఎల్ నేపథ్య గీతంను కాపీ చేయలేదని స్పష్టం చేశారు.
'ఈ వార్త విని నేను షాకయ్యా. నేనే స్వయంగా ఐపీఎల్ బాణిని రూపొందించా. ఇతర కళాకారుల పాటను కాపీ చేయలేదు. నేను, నా టీమ్ ఎంతో కష్టపడి రూపొందించాం. భారత సంగీత రూపకర్తల సంఘం (ఎంసీఏఐ) కూడా నా పాట నిజమైందేనని సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ రెండు పాటలను వారు పరిశీలించారు. రెండింటికీ పోలిక లేదని స్పష్టం చేశారు' అని అజయ్ రావ్ మాల్ప్ తెలిపారు. ఏదేమైనా ప్రస్తుతం సోషల్ మెడియల్ #IplAnthemCopied అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.