టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడును తాను ఉద్దేశపూర్వకంగా దూషించలేదని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అన్నాడు. కానీ సోషల్ మీడియాలో రాయుడుపై దుర్భాషలాడినట్లుగా విషప్రచారం చేస్తున్నారని తెలిపాడు. గత కొన్నిరోజులుగా అంబటి రాయుడు తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో వ్యాఖ్యాతగా విధులు నిర్వహించిన రాయుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, విరాట్ కోహ్లిపై విమర్శలు గుప్పించడం తీవ్ర చర్చనీయాంంగా మారింది.
అంతేగాక ప్లేఆఫ్స్లో ఆర్సీబీ ఓటమిని పరోక్షంగా సెలబ్రేట్ చేసుకోవడంతో రాయుడుపై నెట్టింట వ్యతిరేకత వచ్చింది. మరోవైపు ఇవేం పట్టించుకోకుండా ఐపీఎల్ ఫైనల్లోనూ కోహ్లిని ఉద్దేశిస్తూ రాయుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆరెంజ్ క్యాప్ సాధిస్తే టైటిల్ గెలవలేరని ఎద్దేవా చేశాడు. కేకేఆర్ ప్రదర్శనను కొనియాడుతూ కోహ్లిని విమర్శించాడు.

అయితే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు ముందు సన్రైజర్స్ హైదరాబాద్కు రాయుడు మద్దతుగా నిలిచాడు. ఆరెంజ్ ఆర్మీని ప్రోత్సహిస్తూ ఆరెంజ్ జాకెట్ వేశాడు. కానీ ఫైనల్లో కేకేఆర్ విజయానంతరం పర్పుల్ కలర్ జాకెట్ ధరించాడు. దీనిపై తన సహ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ స్పందిస్తూ అంబటి రాయుడును లైవ్లోనే జోకర్ అన్నాడు. రాయుడు ద్వంద వైఖరిని ఎండగడుతూ అన్నాడు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా కావడంతో రాయుడును జోకర్ అని కావాలని అనలేదని పీటర్సన్ వివరణ ఇస్తూ ట్వీట్ చేశాడు. అనుకోకుండా సరదాగా అన్న ఈ మాటలు రాయుడును తిట్టినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగించారని అన్నాడు. భారత్లో ఆటగాళ్లకు మద్దుతగా లేదా వ్యతిరేకతగా ఉండే వాళ్లు సోషల్ మీడియాలో కాస్త నెమ్మదించాలని కోరాడు. రాయుడును లక్ష్యంగా చేయడాన్ని ఇకపై ఆపేయాలని విజ్ఞప్తి చేశాడు.
ఐపీఎల్-2024లో ఆర్సీబీ-సీఎస్కే ఆఖరి లీగ్ మ్యాచ్ ముగిసిన అనంతరం సోషల్ మీడియాలో వివాదాలకు రాయుడు కేంద్రబిందువుగా మారాడు. ప్లేఆఫ్స్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సీఎస్కేను మట్టికరిపించి బెంగళూరు తదుపరి దశకు దూసుకెళ్లింది. అప్పటి నుంచి చెన్నై మాజీ ప్లేయర్ రాయుడు ఆర్సీబీ, కోహ్లిని లక్ష్యంగా చేసుకుంటూ ఘూటు వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరోవైపు రాయుడు వ్యాఖ్యలను సీఎస్కే ఫ్యాన్స్ షేర్ చేస్తూ ఆర్సీబీని ట్రోల్ చేయడంతో ఈ గొడవ పెద్దగా మారింది. ఈ నేపథ్యంలో రాయుడును పీటర్సన్ జోకర్ అనడంతో కోహ్లి-ఆర్సీబీ ఫ్యాన్స్ దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.