ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ముంబై పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ప్లేఆఫ్స్ అశలు సజీవంగా ఉంచుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (78; 53 బంతుల్లో, 7x4, 3x6) అర్ధశతకంతో చెలరేగాడు. రోహిత్ శర్మ (36; 25 బంతుల్లో, 2x4, 3x6), తిలక్ వర్మ (2x4, 2x6) ఫర్వాలేదనిపించారు. హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. 21 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

అయితే శశాంక్ సింగ్ (41; 25 బంతుల్లో, 2x4, 3x6)తో కలిసి అశుతోష్ శర్మ (61; 28 బంతుల్లో, 2x4, 7x6), గొప్పగా పోరాడాడు. 77 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన జట్టును శశాంక్తో కలిసి ఆదుకున్నాడు. కానీ శశాంక్ ఔటైన సమయానికి కూడా పంజాబ్ విజయంపై ఎవరికీ ఆశల్లేవు. 111 పరుగులకే ఏడు వికెట్ల పడటంతో ముంబై విజయం దాదాపు ఖరారైందని భావించారంతా. కానీ అశుతోష్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బుమ్రా బౌలింగ్లో సిక్సర్ బాదాడు.
పంజాబ్ ఓటమిపాలైనప్పటికీ అశుతోష్ అందర్నీ ఆకర్షించాడు. అశుతోష్తో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగతంగా మాట్లాడారు. అంతేగాక ఈ నయా ఫినిషర్తో ముంబై ఫ్రాంచైజీ కోఓనర్ అకాశ్ అంబానీ ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి కొనియాడాడని సమాచారం. ఆశుతోష్ పోరాటానికి ఫిదా అయినట్లు తెలిపాడంట. వచ్చే సీజన్లో అశుతోష్ను పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకోకపోతే మెగా వేలంలో దక్కించుకోవాలని ముంబై భావిస్తుందని తెలుస్తోంది.
ఫినిషర్ పాత్ర గొప్పగా పోషిస్తున్న అశుతోష్ ముంబై ఇండియన్స్పై మాత్రమే కాదు, గుజరాత్ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై కూడా ఈ సీజన్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మధ్యప్రదేశ్కు చెందిన అశుతోష్ 2023-ముస్తాక్ అలీ టోర్నమెంట్లో 11 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి యువరాజ్సింగ్ (12) ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్ను బ్రేక్ చేశాడు. దీంతో 25 ఏళ్ల అశుతోష్ను పంజాబ్ కింగ్స్ వేలంలో రూ.20 లక్షలకు సొంతం చేసుకుంది.