
హైదరాబాద్: ఇరు జట్లకు ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఐపీఎల్లో భాగంగా జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఢిల్లీపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ చెలరేగి ఆడి జట్టు ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచారు. ఈ మ్యాచ్లో వీరిద్దరూ వేగంగా హాఫ్ సెంచరీలను నమోదు చేసి 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ బుక్లో ఉన్న ఎలాంటి షాట్నైనా కోహ్లి ఆడగలడు. ఎలాంటి బౌలర్నైనా చితకబాదగలడు. అలాంటి కోహ్లి కూడా ఏబీ డివిలియర్స్ ఆడిన ఓ షాట్ చూసి నోరెళ్లబెట్టాడు. ఢిల్లీ డేర్డెవిల్స్తో మ్యాచ్లో ఏబీ స్కేర్లెగ్ దిశగా కొట్టిన సిక్స్ కోహ్లిని షాక్కు గురి చేసింది.
క్రికెట్లో 360 డిగ్రీల్లో షాట్లు కొట్టగల బ్యాట్స్మన్గా పేరు సంపాదించిన డివిలియర్స్.. చాలా రోజుల తర్వాత ఈ మ్యాచ్లో విశ్వరూపం చూపించాడు. కేవలం 37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 72 పరుగులు చేసి ఆర్సీబీని గెలిపించాడు. కెప్టెన్ కోహ్లితో కలిసి మూడో వికెట్కు 118 పరుగులు జోడించడంతో ఆర్సీబీ మరో ఓవర్ మిగిలుండగానే.. 182 పరుగులు భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.
ఇప్పటి వరకూ జరిగిన 11 మ్యాచ్ల స్కోరును బట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగు మ్యాచ్ ల విజయంతో ఏడో స్థానానికి చేరింది. గత మ్యాచ్ ఆధారంగా ప్లేఆఫ్ ఆశలు అయితే ఇంకా సజీవంగానే ఉన్నాయి. కానీ, ప్రతి మ్యాచ్ గెలిస్తేనే ఆ అవకాశం కాపాడుకోగలుగుతుంది.