న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్-9 కోసం రాజ్కోట్ టీం తమ జట్టు వివరాలను ప్రకటించింది. తమ జట్టుకు గుజరాత్ లయన్స్ అని పేరు పెట్టినట్లు పేర్కొంది. ఈ జట్టుకు భారత ఆటగాడు సురేష్ రైనాను కెప్టెన్గా ప్రకటించింది.
మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇంటెక్స్ యజమాని కేశవ్ బన్సల్ ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో జట్టు జెర్సీని ఆవిష్కరించారు. కాగా, ఈ జట్టుకు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు, టీ20 స్పెషలిస్ట్ బ్రాడ్ హోడ్జ్ కోచ్గా నియమితులయ్యాడు.
గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడిన సురేష్ రైనాను ఈ జట్టు రూ. 12.5కోట్లకు కొనుగోలు చేసింది. ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్, అవినీతి ఆరోపణల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్కె) 7గురు, రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్) నుంచి ముగ్గురు క్రికెటర్లను తీసుకుంది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను కూడా రూ. 9.5కోట్లు వెచ్చించి గుజరాత్ లయన్స్ జట్టు కొనుగోలు చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై సుప్రీం కోర్టు రెండేళ్లపాటు నిషేధం విధించిన నేపథ్యంలో తాజా ఐపిఎల్ లీగ్లో రాజ్కోట్, పుణె జట్లు కొత్తగా వచ్చాయి. రాజ్కోట్ను ఇంటెక్స్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది.
కాగా, పుణె జట్టుకు ఎంఎస్ ధోనీ సారథిగా వ్యవహరించనున్నాడు. నిషేధం విధించబడిన రెండు జట్లకు సంబంధించిన 50 మంది ఆటగాళ్లలో 40మందిని ఫిబ్రవరి 6న జరిగే వేలంపాటలో ఇతర జట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.