కోల్కతా: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఖాతాలో మరో విజయం చేరింది. శనివారం వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్లో బెంగళూరు ఏడు వికెట్లతో కోల్కతా నైట్ రైడర్స్పై ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా పది ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 111 పరుగులు చేసింది.
రస్సెల్ (17బంతుల్లో 45) విజృంభించగా, రాబిన్ ఊతప్ప (23) రాణించాడు. అనంతరం బెంగళూరు మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. మన్దీప్ సింగ్ (18 బంతుల్లో 45 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో బెంగళూరును గెలిపించాడు.
కెప్టెన్ కోహ్లీ (20 బంతుల్లో 34), క్రిస్గేల్ (9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. మన్దీప్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. సాధించాల్సిన రన్రేట్ భారీగా ఉండడంతో ఓపెనర్లు క్రిస్ గేల్, కోహ్లీ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించారు. మూడు సిక్సర్లు బాదిన గేల్ను నాలుగో ఓవర్లో బ్రాడ్ హాగ్ అవుట్ చేశాడు.

తర్వాతి ఓవర్లోనే డివిల్లీర్స్ (2)ను చాహల్ పెవిలియన్ చేర్చాడు. కానీ, మన్దీప్ ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టాడు. కోహ్లీని రస్సెల్ అవుట్ చేయడంతో కోల్కతా శిబిరంలో ఆశలు చిగురించాయి. చివరి 12 బంతుల్లో బెంగళూరు విజయానికి 26 రన్స్ అవసరమైన తరుణలో ఉమేశ్ బౌలింగ్లో రెండు ఫోర్లు బాదిన మన్దీప్ చివరి ఓవర్లో మరో రెండు సిక్స్లతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. మ్యాచ్ను 10 ఓవర్లకు కుదించారు. ఆరంభంలోనే గంభీర్ (12) అవుటైనా వన్డౌన్లో వచ్చిన రస్సెల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆరోన్ వేసిన ఆరో ఓవర్లో రెండు సిక్సర్లు, ఫోర్తో రెచ్చిపోయాడు. తర్వాతి ఓవర్లోనూ రెండు బౌండ్రీలు సాధించాడు. ఊతప్ప అవుటైనా పరుగుల వేట కొనసాగించాడు. డష్కాటె (12) కూడా అతనికి సహకరించడంతో జట్టు స్కోరు 100 దాటింది.