ముంబై: తన పనికి తాను కట్టుబడడానికి ప్రయత్నిస్తానని, మీ పని మీరు చేయండని ఢిల్లీ డేర్ డెవిల్స్ డేషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. 44 బంతుల్లో 57 పరుగులు చేసి మిమ్మల్ని విమర్శించేవారికి సమాధానం చెప్పారా అని మీడియా ప్రతినిధులు అడిగితే విమర్శలను చదివే సమయం తనకు లేదని ఆయన చెప్పాడు. తన పని క్రికెట్ ఆడడమని, విమర్శకుల పని రాయడమని, ఏం రాస్తున్నారనేది తాను చదవనని, ఈ సమయంలో అంత తీరిక తనకు లేదని ఆయన అన్నాడు.
40 పరుగులకే నాలుగు ముంబై వికెట్లు తీశామని, అయినా విజయం సాధించలేకపోయామని యువరాజ్ సింగ్ అన్నాడు. మంగళవారంనాడు జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్పై డేర్ డెవిల్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. 40 పరుగులకు నాలుగు వికెట్లు తీసిన తర్వాత తాము మ్యాచు గెలవాల్సి ఉండిందని, అయితే తర్వాత వికెట్లు తీయలేకపోయామని అన్నాడు.

వర్షం పడిన తర్వాత పిచ్పై మంచు ఉండిపోయిందని, స్పిన్ పడలేదని, దానివల్లనే ముంబైకి అవకాశం లభించిందని, వారు బాగా ఆడారనే విషయంలో సందేహం లేదని ఆయన అన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, అంబటి రాయుడు బాగా ఆడారని ఆయన కొనియాడాడు.
వర్షం పడకుండా ఉంటే స్పిన్ తిరిగి ఉండేదని, ఫలితం భిన్నంగా ఉండేదని ఆయన అన్నాడు. ట్వంటీ20 చాలా పొట్టి ఫార్మాట్ అని, 4 -5 స్థానాల్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమని, మొదటి బంతి నుంచి బాదడం ప్రారంభించాలని, ముంబైతో మ్యాచులో తాము వికెట్లు కోల్పోయామని, తనకు కొంత అవకాశం దక్కిందని అన్నాడు.
తనకూ, జట్టుకూ మంచిదే అయిందని, అయితే విజయం సాధించడం ముఖ్యమని అన్నాడు. రెండు పాయింట్లు సాధించకపోతే వృధానే అని అన్నాడు.