న్యూఢిల్లీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నాకౌట్ ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఢిల్లీ డేర్ డెవిల్స్పై శుక్రవారం జరిగిన మ్యాచులో ఓటమి పాలైంది. నిరుడు రన్నరప్గా నిలిచిన పంజాబ్ ఖాతాలో ఇది ఆరో పరాజయం. హ్యాట్రిక్ ఓటమి కూడా. ఎప్పటిలాగే బ్యాటింగ్ వైఫల్యం పంజాబ్ కొంప ముంచింది.
సెహ్వాగ్ (1) మళ్లీ విఫలం కావడం, ఆ తర్వాత వరుసగా వోహ్రా (1), మార్ష్ (5), సాహా (3) - టాప్ ఆర్డర్ అంతా పెవిలియన్కు క్యూ కట్టడంతో పంజాబ్ జట్టు 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినా 8 వికెట్లకు 118 పరుగులు మాత్రమే చేసింది. మిల్లర్ (42; 41 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్) రాణించినా, తనదైన స్టయిల్లో ధాటిగా ఆడలేకపోయాడు.
అతని తర్వాత బెయిలీ (18), అక్షర్ పటేల్ (22)ల రూపంలో రెండంకెల స్కోర్లు చేసింది ఇద్దరే. చాన్నాళ్లుగా ఫీల్డ్కు దూరంగా ఉన్న జహీర్ ఖాన్ గొప్ప పునరాగమనం చేశాడు. ఐపీఎల్లో ఇన్నాళ్లూ గాయం కారణంగా డగౌట్కే పరిమితమైన జహీర్ రెండు కీలక వికెట్లు పడగొట్టడమే కాదు, తన కోటాలో అత్యంత పొదుపుగా 17 పరుగులే ఇచ్చుకున్నాడు. ఢిల్లీకి జహీర్ సూపర్ ఆరంభాన్నిస్తే, ఆస్ట్రేలియన్ పేసర్ కల్టర్ నైల్ 4 వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు.
ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (52 నాటౌట్; 40 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయాస్ అయ్యర్ (54; 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో ఢిల్లీ 13.5 ఓవర్లలోనే, అంటే మరో 37 బంతులు మిగిలి వుండగానే వికెట్ మాత్రమే నష్టపోయి విజయాన్నందుకుంది. మిచెల్ జాన్సన్ గైర్హాజరీలో మరింత బలహీనంగా మారిన పంజాబ్ బౌలింగ్ను అగర్వాల్-అయ్యర్ జోడీ చెడుగుడు ఆడేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరూ తొలి వికెట్కు 106 పరుగులు జోడించడం విశేషం. 4వికెట్లు పడగొట్టిన కల్టర్నైల్కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.