కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడకపోవడం పాకిస్తాన్ ఆటగాళ్లకు లోటేనని పాకిస్తాన్ మాజీ వసీమ్ అక్రమ్ అన్నాడు. నైపుణ్యాన్ని సాన పెట్టుకోవడానికి ఐపీఎల్ గొప్ప వేదిక అన్నాడు. తమ ఆటగాళ్లు ఐపీఎల్లో లేకపోవడం వల్ల పాకిస్థాన్, ఇంగ్లాండ్లు చాలా కోల్పోతున్నాయన్నాడు.
ఐపీఎల్ వల్ల ఆటగాళ్లకు ఆర్థిక లబ్ధి చేకూరడమే కాదని, నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశమూ లభిస్తుందన్నాడు. వేలాది ప్రేక్షకుల మధ్య ఆడడం ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేస్తుందని చెప్పాడు. ఐపీఎల్లో బ్యాట్స్మెన్, బౌలర్లు ఎంతో నేర్చుకుంటారన్నాడు.
వేలాది ప్రేక్షకులు చూస్తుండగా ఆడితే గుర్తింపు కూడా లభిస్తుందని చెప్పాడు. భవిష్యత్తులో పాకిస్థాన్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా తప్పక ఐపీఎల్లో ఆడతారని ఆశిస్తున్నానని చెప్పాడు. అదే సమయంలో అక్రమ్ కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్ సునీల్ నరైన్కు మద్దతుగా నిలిచాడు.
సునీల్ నరైన్ హార్డ్ వర్కర్ అని, త్వరలో అతనికి అనుకూలంగా జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పాడు. గత సీజన్లో ఇతను బాగా ఆకట్టుకున్నాడని చెప్పాడు. కాగా వసీమ్ అక్రమ్ కోల్కతా నైట్రైడర్స్ కోచ్గా పని చేస్తున్న అన్నాడు.