ముంబై: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో రెండు రోజుల క్రితం ముంబై ఇండియన్స్ ఓడిన అంశంపై హర్భజన్ సింగ్ స్పందించాడు. ఆ వికెట్ పైన 170 పరుగులు చేధించవచ్చునని చెప్పాడు. కానీ తమకు విరుద్ధమైన ఫలితం (ఓటమి) వచ్చిందన్నాడు.
తాము మొదట్లోనే వికెట్లు కోల్పోవడం నష్టం తెచ్చిందన్నాడు. కొత్త బంతితో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లు బాగా బౌల్ చేశారని కితాబిచ్చాడు. ఇది తమకు గుర్తు పెట్టుకోవాల్సిన మ్యాచ్ కాదన్నాడు. ముంబై సామర్థ్యం మొత్తం మొదటి ఆరు ఓవర్లలోనే ఉంటుందని చెప్పాడు.
పంజాబ్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్లు తొలి ఐదు ఓవర్లలోనే యాభై పరుగులు చేశారన్నాడు. తాము 170 పరుగులకే పంజాబ్ను కట్టడి చేశామన్నాడు. దానిని ఛేదించవచ్చునని చెప్పాడు.

రోహిత్ శర్మ అవుట్ కావడంతోనే తాము బాగా నష్టపోయామన్నాడు. తాము మరింత బాగా బ్యాటింగ్ చేయాల్సి ఉండెనని చెప్పాడు. మ్యాచ్ గెలిపించేందుకు తాను ప్రయత్నించానని చెప్పాడు. కానీ, తాను పూర్తి చేయలేకపోయానని చెప్పాడు. తన బౌలింగ్ పట్ల తాను సంతృప్తిగానే ఉన్నానని చెప్పాడు.
ఐపీఎల్ 8లో మొదటి ఆలౌట్
ఐపీఎల్ 8 సీజన్లో తొలిసారి ఆలౌట్ చేసిన ఘనత సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో హైదరాబాదు.. బెంగళూరు జట్టును ఆలౌట్ చేసింది. మరో బంతి మిగిలి ఉండగానే ఆ జట్టును ఆలౌట్ చేసారు. ఈ ఐపీఎల్లో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన తొలి జట్టు సన్ రైజర్స్దే.