ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీ, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 18వ ఓవర్ సమయంలో స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ బంతి ఆకారంపై అనుమానం వ్యక్తం చేశాడు. బంతి సరిగ్గా లేదని అంపైర్లకు చూపిస్తూ టిమ్ డేవిడ్ వాదనకు దిగడంతో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. అంపైర్లు బంతిని తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. టిమ్ డేవిడ్ తన అభ్యంతరాన్ని గట్టిగా వినిపించాడు.
రోహిత్, టిమ్ డేవిడ్ మధ్య చర్చ
ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జోక్యం చేసుకున్నాడు. అంపైర్లతో మాట్లాడి పరిస్థితిని సర్దుమణిగేలా చూడాలని కోరాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, టిమ్ డేవిడ్ మధ్య కూడా కొద్దిసేపు చర్చ జరిగింది. చివరకు అంపైర్లు జోక్యం చేసుకుని బ్యాటర్ ను శాంతపరిచి ఆటను తిరిగి ప్రారంభించారు. ఈ ఘటన మైదానంలో ప్రేక్షకులను, టీవీలో చూస్తున్న అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.

దంచికొట్టిన టిమ్ డేవిడ్
మ్యాచ్ విషయానికి వస్తే.. టిమ్ డేవిడ్ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కేవలం 16 బంతుల్లో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో రెండు ఫోర్లు, మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి. అంతకు ముందు ఫిల్ సాల్ట్(78), విరాట్ కోహ్లీ(50), కెప్టెన్ రజత్ పాటిదార్ (53)లు ముంబై బౌలర్లపై విరుచుకుపడటంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఓటమికి కారణాలివే..
ముంబై ఇండియన్స్ బౌలర్లకు ఈ మ్యాచ్ ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నప్పటికీ ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా మయాంక్ మార్కండే 2 ఓవర్లలోనే 40 పరుగులు సమర్పించుకోగా.. శార్దూల్ ఠాకూర్ కూడా భారీగా పరుగులు ఇచ్చారు. బౌలింగ్లో వైఫల్యం, ఫీల్డింగ్లో తప్పిదాలు ముంబై పరాజయానికి ప్రధాన కారణమయ్యాయి.