బుడ్డోడు vs పులి.. ఎవరిది పైచేయి?
నేడు(సోమవారం) ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు కేవలం రెండు జట్ల మధ్య మ్యాచ్ మాత్రమే కాదు.. అది విధ్వంసకర ఓపెనర్ల మధ్య జరుగుతున్న అసలైన సమరం. సాధారణంగా టీ20ల్లో ఓపెనర్లు ఇచ్చే ఆరంభంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ విషయంలో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ జట్టు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనింగ్ జోడీలను కలిగి ఉన్నాయి. ఓ వైపు ఎడమచేతి వాటం బ్యాటర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ సన్రైజర్స్కు కొండంత అండగా ఉంటే.. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ వద్ద వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వంటి మెరుపు వీరులు ఉన్నారు. ఈ నాలుగు మ్యాచ్ల్లో వీరి ప్రదర్శన చూస్తుంటే.. పవర్ప్లేలోనే 100 పరుగులు చేయడం వీరికి పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. ఈ నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లలో ఏ జంట ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల సునామీ సృష్టిస్తుందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
సన్రైజర్స్కు తప్పని కష్టాలు: బౌలింగ్లో వైఫల్యం
ఈ సీజన్లో 300 పరుగుల మార్కును దాటగల సత్తా ఉన్న జట్టుగా పేరు తెచ్చుకున్న సన్రైజర్స్.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కావడంతో ఇషాన్ కిషన్ సారథ్యంలో జట్టు ఇబ్బందులు పడుతోంది. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉంది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, క్లాసెన్ అద్భుతంగా ఆడుతున్నప్పటికీ.. బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం జట్టును దెబ్బతీస్తోంది. ముఖ్యంగా గత మ్యాచ్లో పంజాబ్పై 220 పరుగుల భారీ స్కోరును కూడా కాపాడుకోలేకపోవడం వారి బలహీనతను స్పష్టం చేస్తోంది. జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్ వంటి సీనియర్ బౌలర్లు గాడిలో పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
మరోవైపు రియాన్ పరాగ్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ఓటమి ఎరుగకుండా దూసుకుపోతోంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ గెలిచి 8 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ విజయాల్లో 15 ఏళ్ల యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కేవలం 266.66 స్ట్రైక్ రేట్తో 200 పరుగులు చేసిన వైభవ్ రెండు అర్థ శతకాలు బాదాడు. ఇందులో విశేషం ఏంటంటే.. ఆ రెండు అర్ధశతకాలు కేవలం 15 బంతుల్లోనే రావడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ కూడా ఫామ్లో ఉండటం, బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ ప్రత్యర్థులను వణికిస్తుండటం రాజస్థాన్ను ఫేవరెట్గా నిలబెడుతోంది.
గెలుపెవరిది?
హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో సన్రైజర్స్ పుంజుకోవాలని చూస్తుంటే.. తమ విజయ పరంపరను కొనసాగించాలని రాజస్థాన్ పట్టుదలతో ఉంది. బౌలింగ్ విభాగంలో రాజస్థాన్ పటిష్టంగా కనిపిస్తుండగా, బ్యాటింగ్ పరంగా ఇరుజట్లు సమతూకంగా ఉన్నాయి. పవర్ప్లేలో ఏ జట్టు బౌలర్లు ప్రత్యర్థి ఓపెనర్లను త్వరగా పెవిలియన్కు పంపుతారో ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్కు అనుకూలించే పిచ్ కావడంతో మరోసారి పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణాలు
అభిషేక్ శర్మ పవర్ప్లేలో ఎలాగైతే విధ్వంసం సృష్టిస్తాడో, వైభవ్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. బుమ్రా వంటి దిగ్గజ బౌలర్లను సైతం లెక్కచేయకుండా భారీ షాట్లు కొడుతుండటం భారత క్రికెట్లో కొత్త శకానికి నాందిగా కనిపిస్తోంది. ఈ ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్ల దూకుడు చూస్తుంటే, టీ20 క్రికెట్లో భారత్ భవిష్యత్తు అత్యంత సురక్షితంగా, దూకుడుగా ఉండబోతుందని స్పష్టమవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications