పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు భారీ జరిమానా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026) 2026 సీజన్ అరంగేట్రంలోనే పంజాబ్ కింగ్స్ జట్టుకు ఓ మంచి, మరో చేదు అనుభవాలు ఒకేసారి ఎదురయ్యాయి. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించి పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచినప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు మాత్రం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పెద్ద షాకిచ్చింది. మ్యాచ్ను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంలో వైఫల్యం చెందినందుకు గానూ భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చింది.
స్లో ఓవర్ రేట్.. శ్రేయస్కు భారీ జరిమానా!
గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత సమయం కంటే ఎక్కువ సమయం తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరీ గుర్తించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. స్లో ఓవర్ రేట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో పంజాబ్ జట్టుకు ఇది మొదటి తప్పు కావడంతో కేవలం కెప్టెన్ పైనే చర్యలు తీసుకున్నారు. అయితే ఇదే పొరపాటు మళ్లీ జరిగితే జరిమానా మొత్తం పెరగడంతో పాటు జట్టులోని అందరికీ కూడా పెనాల్టీ పడే అవకాశం ఉంటుంది.

సత్తా చాటిన పంజాబ్ బౌలర్లు
ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన అనుభవాన్నంతా రంగరించి మిడిల్ ఓవర్లలో గుజరాత్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. చాహల్ 4 ఓవర్లలో కేవలం 28 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీయగా.. పేసర్ వైశాఖ విజయ్కుమార్ 34 పరుగులిచ్చి 3 వికెట్లతో చెలరేగాడు. వీరిద్ధరి ధాటికి గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ జట్టులో శుభ్మన్ గిల్(39), జోస్ బట్లర్(38) ఓ మోస్తరుగా రాణించినప్పటికీ.. భారీ స్కోరు సాధించలేకపోయారు.
అరంగేట్ర హీరో కూపర్ కాన్లీ వీరవీహారం
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ప్రసిద్ధ్ కృష్ణ తన నిప్పులు చెరిగే బంతులతో పంజాబ్ టాపార్డర్ను వణికించాడు. అయితే తన అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా యువ ఆటగాడు కూపర్ కాన్లీ అద్భుతం చేశాడు. ఒత్తిడిలోనూ అద్భుతమైన షాట్లతో అలరించిన కాన్లీ.. కేవలం 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచి పంజాబ్ కింగ్స్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ (37) అందించిన సహకారంతో పంజాబ్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందున్న సవాలు
గెలుపుతో సీజన్ను ప్రారంభించడం శ్రేయస్ అయ్యర్కు ఊరటనిచ్చే అంశమే అయినా.. బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ సెట్టింగ్స్ విషయంలో సమయాన్ని వృథా చేయకుండా ఉండటం ఇప్పుడు శ్రేయస్ అయ్యర్కు కీలకంగా మారింది. ఐపీఎల్ రూల్స్ కఠినంగా ఉన్న నేపథ్యంలో, తర్వాతి మ్యాచ్ల్లో సమయపాలన పాటించకపోతే కెప్టెన్గా నిషేధాన్ని కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి గెలుపు జోష్ను కొనసాగిస్తూనే.. మైదానంలో క్రమశిక్షణను కాపాడుకోవడం పంజాబ్ కింగ్స్ తదుపరి లక్ష్యం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications