IPL 2026: ఐపీఎల్ 19 సీజన్కు ముందు బిగ్ షాక్ తగిలింది. కొందరు దిగ్గజ ఆటగాళ్లు ఈ సీజన్లో కనిపించరు. వీరంతా ఇంతకు ముందు సుదీర్ఘ కాలం పాటు ఐపీఎల్ లో తమ సత్తా చాటిన ఆటగాళ్లు కావడం గమనార్హం. ఐపీఎల్ 19వ సీజన్కు ముందు ఐదుగురు కీలక ఆటగాళ్లు.. వారిలో కొందరు కెప్టెన్లు మ్యాచ్ విన్నర్లు లీగ్ నుంచి తప్పుకోవడం, రాబోయే సీజన్ సమీకరణాలను పూర్తిగా మార్చబోతోంది. డిసెంబర్ 16న అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనాలో జరగబోయే మినీ వేలానికి ముందే పలువురు దిగ్గజ ఆటగాళ్లు ఐపీఎల్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వీరు 2025 సీజన్ వరకు తమ సత్తా చూపించినప్పటికీ.. ఇప్పుడు 2026 సీజన్లో ఆడేందుకు ఆసక్తి చూపడం లేదు. అగ్రశ్రేణి ఆటగాళ్లు లీగ్కు దూరం కావాలని నిర్ణయించుకోవడం క్రికెట్ అభిమానులను, ఫ్రాంఛైజీలను ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ లీగ్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న కొందరు ప్రముఖ క్రికెటర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. మొయిన్ అలీ
ఇంగ్లండ్కు చెందిన మాజీ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా ఆయన ఐపీఎల్ 2026లో కన్పించే అవకాశం లేదు. ఆయన ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించగా.. ఇది క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. 2025 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన మొయిన్ ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. మొయిన్ అలీ ఐపీఎల్లో మొత్తం 73 మ్యాచ్లు ఆడి, 1167 పరుగులు చేసి, 41 వికెట్లు పడగొట్టారు. ఆయన స్ట్రైక్ రేట్ 139.76గా, ఎకానమీ రేట్ 7.22గా ఉంది.

2. ఫాఫ్ డుప్లెసిస్ కూడా పీఎస్ఎల్కే మొగ్గు
మొయిన్ అలీ మాదిరిగానే దక్షిణాఫ్రికా దిగ్గజం ఫాఫ్ డుప్లెసిస్ కూడా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఐపీఎల్ కంటే పీఎస్ఎల్కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఐపీఎల్ నుంచి తప్పుకోవడం తనకెంతో కష్టమైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. డుప్లెసిస్ తన 13 ఐపీఎల్ సీజన్లలో 7 చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడారు. 2022 నుంచి 2024 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్గా వ్యవహరించిన ఆయన, 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీని ధరించారు. ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్లో 4773 పరుగులు చేశారు, ఆయన స్ట్రైక్ రేట్ 135.78గా ఉంది.
3. గ్లెన్ మాక్స్వెల్ వేలానికి దూరం
ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంటూ ఐపీఎల్ 2026 వేలానికి తన పేరును ఇవ్వలేదు. ఆయన ఈ నిర్ణయం వెనుక ప్రత్యేక కారణమేదీ వెల్లడించనప్పటికీ, భారతీయ అభిమానులకు వారి మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన విదేశీ ఆటగాళ్లలో మాక్స్వెల్ ఒకరు. గత రెండు సీజన్లలో (2024, 2025) ఆయన ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. 15 ఇన్నింగ్స్లలో కేవలం 100 పరుగులు మాత్రమే చేశారు, స్ట్రైక్ రేట్ 109.44 మాత్రమే ఉంది.
4. ఆండ్రీ రస్సెల్ రిటైర్మెంట్
వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఇటీవల ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించినప్పటికీ.. రాబోయే సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) కుటుంబంలోనే ఉంటూ, 'పవర్ కోచ్' పాత్ర పోషిస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీ డేర్డెవిల్స్ (ప్రస్తుతం క్యాపిటల్స్) తరఫున మొదలుపెట్టి, KKRతో తన తుఫాను బ్యాటింగ్తో జట్టులో కీలక ఆటగాడిగా మారారు. ఆయన ఐపీఎల్లో 140 మ్యాచ్లు ఆడి, 2651 పరుగులు చేసి, 123 వికెట్లు పడగొట్టారు.
5. అశ్విన్ కూడా గుడ్ బై
భారత క్రికెట్ దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ ఏడాది ఆగస్టులో సోషల్ మీడియా ద్వారా తన ఐపీఎల్ కెరీర్కు వీడ్కోలు పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర టీ20 లీగ్లలో ఆడేందుకు సిద్ధంగా ఉంటానని ఆయన తన 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) హ్యాండిల్లో పేర్కొన్నారు. అశ్విన్ తన 16 ఐపీఎల్ సీజన్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించారు. 187 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఆయన ఐదో స్థానంలో ఉన్నారు. ఆయన ఎకానమీ రేట్ 7.20 చాలా ఆకట్టుకునేలా ఉంది. 2010, 2011లో సీఎస్కే టైటిల్స్ గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.