IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్కు ముందు ఆటగాళ్ల ట్రేడింగ్ విండోలో ఓ సంచలన విషయం బయటపడింది. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడూతూ.. ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకున్నట్లు పొరపాటున ధ్రువీకరించారు. అప్పటివరకు కేవలం ఊహాగానాల్లో ఉన్న ఈ వార్త.. అశ్విన్ కామెంట్స్తో ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
రవిచంద్రన్ అశ్విన్ 'యాష్ కీ బాత్'లో లీక్
ఐపీఎల్ ట్రేడింగ్ విండో ముగియనున్న నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్, ముంబై ఆటగాడు అర్జున్ టెండూల్కర్ విషయంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీల మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్నాయని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఆటగాళ్ల పరస్పర మార్పిడి కాదని.. రెండు ఫ్రాంచైజీల మధ్య జరిగే వ్యక్తిగత డీల్స్ అని క్రిక్బజ్ వంటి క్రీడా వేదికలు తమ కథనాలలో పేర్కొన్నాయి. ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తూ.. రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ 'యాష్ కీ బాత్'లో ఓ సంచలన కామెంట్ చేశారు.

స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. "ముంబై ఇండియన్స్ ఎవరినీ విడుదల చేస్తుందని నేను అనుకోవడం లేదు. తరచూ గాయాలపాలయ్యే దీపక్ చాహర్కు ప్రత్యామ్నాయం వెతకడం వారికి పెద్ద సవాలుగా ఉంటుంది. వారు ఇప్పటికే లక్నో నుంచి శార్దూల్ ఠాకూర్ను ట్రేడ్ ద్వారా దక్కించుకున్నారు. ఇది జరిగిపోయింది. బహుశా వారు ఓ స్పిన్నర్ కోసం చూసి అతడిని కూడా తీసుకుంటారు" అని రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించారు. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీలు అధికారికంగా ప్రకటించకముందే ట్రేడింగ్ విషయాన్ని అశ్విన్ బయటపెట్టడం వివాదాస్పదం కావడంతో.. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ వీడియో నుంచి ఆ భాగాన్ని ఆయన తక్షణమే తొలగించారు.
శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్ కెరీర్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆశ్చర్యకరంగా శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్సోల్డ్ ఆటగాడిగా మిగిలిపోయాడు. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో మొహ్సిన్ ఖాన్ గాయపడటంతో అతడి స్థానంలో శార్దూల్ను జట్టులోకి తీసుకున్నారు.సీజన్ ఆరంభంలో ఆడిన తొలి రెండు మ్యాచ్లలో 6 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించినప్పటికీ, ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు. మొత్తం 10 మ్యాచ్లలో శార్దూల్ 13 వికెట్లు మాత్రమే తీశాడు. వేలంలో అమ్ముడుపోకపోవడంపై శార్దూల్ గతంలో స్పందిస్తూ.. "క్రికెట్లో ఇలాంటివి జరుగుతుంటాయి. వేలంలో అది నాకు ఒక చెడ్డ రోజు. లక్నో జట్టులో బౌలర్లకు గాయాలవడంతో వారే నన్ను మొదట సంప్రదించారు. జహీర్ ఖాన్ వంటి లెజెండ్ ఉన్నప్పుడు నేను అంగీకరించాల్సి వచ్చింది. క్రికెట్లో ఇలాంటి ఎత్తుపల్లాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
అర్జున్ టెండూల్కర్ పరిస్థితి
శార్దూల్ ట్రేడ్తో ముడిపడిన మరో ఆటగాడు అర్జున్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ కుమారుడైన అర్జున్ 2023లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసి, ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడి కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. ఐపీఎల్ 2025 వేలంలో అతడిని ముంబై ఇండియన్స్ రూ. 30 లక్షల కనీస ధరకు తిరిగి కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్ ఎప్పుడూ ట్రేడింగ్ విషయంలో చురుకుగా ఉంటుంది. శార్దూల్ లాంటి అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ను దక్కించుకోవడం ద్వారా తమ ఫాస్ట్ బౌలింగ్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని ముంబై ఇండియన్స్ చూస్తోంది.