IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్కు ముందు ట్రేడింగ్ మార్కెట్లో అతిపెద్ద సంచలనానికి తెరలేవనుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, వికెట్ కీపర్-బ్యాటర్ అయిన సంజూ శాంసన్ ఐదు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టులోకి రావడం దాదాపు ఖాయమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సంజూ శాంసన్ కోసం సీఎస్కే.. రాజస్థాన్ రాయల్స్తో జరుపుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి.
సీఎస్కేలోకి సంజూ శాంసన్ ట్రేడ్ ఖాయం!
ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే సంజూ శాంసన్ తదుపరి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడబోవడం లేదని వార్తలు రావడం మొదలయ్యాయి. ఈ ఊహాగానాలు ఇప్పుడు నిజమయ్యే దిశగా పయనిస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. ఐదుసార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సంజూ శాంసన్ ట్రేడ్ జరగనుంది. ఈ ట్రేడింగ్ డీల్ చివరి దశలో ఉందని, త్వరలోనే ఫ్రాంచైజీల నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

రికార్డ్-బ్రేకింగ్ 'ట్రిపుల్ ట్రేడ్'
ఆ నివేదికలో ఈ డీల్ గురించి మరింత సంచలన విషయం వెల్లడైంది. సంజూ శాంసన్ను దక్కించుకోవడానికి సీఎస్కే తమ జట్టులోని ఇద్దరు ముఖ్య ఆటగాళ్లతో ట్రేడ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సంజూ శాంసన్ కోసం సీఎస్కే తమ దిగ్గజ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్లను రాజస్థాన్ రాయల్స్కు అప్పగించనుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రికార్డ్ బ్రేకింగ్ ట్రేడ్ డీల్గా నిలిచే అవకాశం ఉంది.గతంలో సంజూ శాంసన్ ఢిల్లీ క్యాపిటల్స్లోకి ట్రిస్టన్ స్టబ్స్తో ట్రేడ్ అవుతాడనే వార్తలు వచ్చినా.. ఇప్పుడు సీఎస్కే డీల్కు దాదాపుగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. రవీంద్ర జడేజా రాజస్థాన్ జట్టులోకి వెళ్లడమనేది సీఎస్కే అభిమానులకు ఓ పెద్ద షాక్. ఎందుకంటే రవీంద్ర జడేజా ధోనీకి అత్యంత నమ్మకమైన ఆటగాడు. అయితే సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్ను దక్కించుకోవాలంటే రవీంద్ర జడేజాను వదులుకోవడానికి సీఎస్కే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ధోనీ వారసత్వానికి సంజూ శాంసన్
ఈ ట్రేడ్ డీల్కు ప్రధాన కారణం సీఎస్కే భవిష్యత్తు. 44 ఏళ్ల దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ కెరీర్ ముగింపు దశలో ఉంది. ఎంఎస్ ధోని తర్వాత వికెట్ కీపింగ్, కెప్టెన్సీలో సరైన ప్రత్యామ్నాయాన్ని సీఎస్కే ఇప్పటివరకు కనుగొనలేకపోయింది. సంజూ శాంసన్ ఈ రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగల సత్తా ఉన్న ఆటగాడు. సంజూ శాంసన్ కేవలం అద్భుతమైన వికెట్ కీపరే కాకుండా.. టాపార్డర్లో నిలకడగా, దూకుడుగా బ్యాటింగ్ చేయగలడు. ధోని నుంచి కీపింగ్ గ్లవ్స్ను స్వీకరించి సీఎస్కేను బలోపేతం చేసే కీలక ప్లేయర్గా సంజూ మారనున్నాడు.
రవీంద్ర జడేజాకు సొంత గూటికి రీ-ఎంట్రీ
ఈ ట్రేడ్లో మరో ఆసక్తికరమైన అంశం రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్లోకి తిరిగి రావడం. జడేజా తన ఐపీఎల్ కెరీర్ను 2008లో రాజస్థాన్ రాయల్స్ నుంచే ప్రారంభించాడు. షేన్ వార్న్ సారథ్యంలోని ఆ జట్టు మొట్టమొదటి ఐపీఎల్ సీజన్ టైటిల్ను గెలవడంలో జడేజా యువ ఆటగాడిగా కీలక పాత్ర పోషించాడు.జడేజా తిరిగి రావడం రాజస్థాన్కు బౌలింగ్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్లో అనుభవాన్ని జోడించడమే కాకుండా, వారి జట్టు కూర్పును మరింత సమతుల్యం చేయనుంది. ఈ ట్రేడ్ డీల్తో సీఎస్కే, రాజస్థాన్ రాయల్స్.. రెండూ తమ జట్టు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. అధికారిక ప్రకటన కోసం ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.