ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ ఉత్కంఠభరిత పోరు పరుగుల కుభమేళాను తలపించింది. ఈ ఒక్క మ్యాచ్లోనే ఏకంగా 529 పరుగులు నమోదవ్వగా.. బ్యాటర్లు 33 సిక్సర్లు, 49 ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో 7 బాల్స్ మిగిలి ఉండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా ప్రపంచ టీ20 క్రికెట్లోనే అత్యంత విజయవంతమైన రన్-ఛేజ్గా రికార్డుకెక్కింది.
ఐపీఎల్లో 150 బాదిన తొలి భారతీయుడు
ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేఎల్ రాహుల్ 152 పరుగులతో అజేయంగా నిలిచి ఐపీఎల్లో 150 పరుగుల మార్కును అందుకున్న తొలి భారతీయ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వారిలో క్రిస్ గేల్(175*), బ్రెండన్ మెకల్లమ్ (158*) తర్వాత రాహుల్ ఇప్పుడు మూడో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఇది కేఎల్ రాహుల్ కెరీర్లో 6వ ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. దీనితో అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ (8) తర్వాత స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, నితీష్ రాణా మధ్య జరిగిన 220 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద భాగస్వామ్యంగా నమోదైంది. గతంలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ (229 పరుగులు) నెలకొల్పిన రికార్డు ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. అలాగే టీ20 క్రికెట్లో ఓ భారతీయ బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరుగా తిలక్ వర్మ (151) పేరిట ఉన్న రికార్డును కేఎల్ రాహుల్ ఈ ఇన్నింగ్స్తో అధిగమించి 'కింగ్' అనిపించుకున్నాడు.
ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో పంజాబ్ కింగ్స్ మరోసారి తన సత్తా చాటింది. గతంలో 2024లో కేకేఆర్పై 261 పరుగులను ఛేదించిన పంజాబ్, ఇప్పుడు ఆ రికార్డును తానే తిరగరాస్తూ 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటర్ల సమిష్టి కృషితో సాధ్యమైన ఈ విజయం టీ20 క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుతంగా మిగిలిపోతుంది. ఓటమి పాలైనప్పటికీ ఢిల్లీ కెప్టెన్ కేఎల్ రాహుల్ పోరాటం మాత్రం రికార్డుల పరంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది.