తేలిపోయిన సీఎస్కే బౌలర్లు.. సొంత గడ్డపై చెన్నై చిత్తు!
CSK vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2026) 2026లో ఐదు సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వరుసగా రెండో షాక్ తగిలింది. సొంత గడ్డపై అభిమానుల హోరు మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ వరుసగా రెండో గెలుపును నమోదు చేయగా.. సీఎస్కే తన ఖాతాను తెరవడంలో మరోసారి విఫలమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన చేసింది. చెన్నై నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ బ్యాటర్లు మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించడం విశేషం. గత 8 మ్యాచ్ల్లో సీఎస్కేపై పంజాబ్కు ఇది 7వ విజయం కావడం గమనార్హం.
ఆయుష్ మాత్రే మెరుపులు.. సీఎస్కే భారీ స్కోరు
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ సంజు శాంసన్ (7) మరోసారి నిరాశపరిచాడు. అయితే యువ సంచలనం ఆయుష్ మాత్రే తన విధ్వంసకర బ్యాటింగ్తో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఆయుష్ మాత్రే.. మొత్తం 43 బంతుల్లో 73 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (28)తో కలిసి అతను రెండో వికెట్కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మధ్యలో కార్తీక్ శర్మ (1) విఫలమైనప్పటికీ, సర్ఫరాజ్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 12 బంతుల్లో 32 పరుగులు (6 ఫోర్లు, 1 సిక్సర్) చేసి ఇన్నింగ్స్కు ఊపు తెచ్చాడు. చివర్లో శివమ్ దూబే 28 బంతుల్లో 45 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టు స్కోరును 5 వికెట్ల నష్టానికి 209 పరుగులకు చేర్చాడు. పంజాబ్ బౌలర్లలో విజయ్కుమార్ వైశాఖ్ 2 వికెట్లు తీశాడు.

పంజాబ్ ఛేజింగ్.. సీఎస్కే బౌలర్ల వైఫల్యం
210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఏమాత్రం తడబడలేదు. నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభం నుండే విరుచుకుపడింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ మొదటి వికెట్కు కేవలం 4.2 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. ప్రియాంశ్ ఆర్య కేవలం 11 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్ 43 పరుగులు చేసి రన్ అవుట్ కాగా, కూపర్ కానోలీ (36) తన వంతు సహకారం అందించాడు. అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అయ్యర్.. మొత్తం 29 బంతుల్లో 50 పరుగులు (4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్ (9*), శశాంక్ సింగ్ (14*) అజేయంగా నిలిచి 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ ఓటమితో సీఎస్కే పాయింట్ల పట్టికలో వెనుకబడగా, పంజాబ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications