ధోనీ వచ్చేశాడు.. క్లారిటీ ఇచ్చిన సీఎస్కే!
టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు ఓ శుభవార్త అందింది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం నుంచి గాయం కారణంగా మైదానానికి దూరంగా ఉన్న ఎంఎస్ ధోనీ.. శనివారం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరగబోయే మ్యాచ్ కోసం జట్టు సభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నాడు. సీఎస్కే తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో ఎంఎస్ ధోనీ టీమ్ బస్సులో ప్రయాణిస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో ఈ రాత్రి మ్యాచ్లో 'తలా' బరిలోకి దిగుతాడా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.
చీలమండ గాయం ఎంతవరకు తగ్గింది?
చీలమండ గాయం కారణంగా ఎంఎస్ ధోనీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఎంఎస్ ధోనీ కోలుకోవడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుందని గతంలో ఫ్రాంచైజీ పేర్కొంది. ప్రస్తుతం ఆ గడువు ముగియడం, జట్టుతో కలిసి ఆయన హైదరాబాద్కు ప్రయాణించడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. అయితే మైదానంలో ధోనీ ప్రాక్టీస్ సెషన్లను గమనిస్తే ఆయన ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది.

ప్రాక్టీస్ సెషన్లో ధోనీ పరిస్థితి
తాజా సమాచారం ప్రకారం.. ఎంఎస్ ధోనీ నెట్స్లో కేవలం లైట్ ప్రాక్టీస్ మాత్రమే చేస్తున్నాడు. ధోనీ ఇంకా పూర్తి బలంతో బ్యాటింగ్ చేయడం లేదని.. కేవలం త్రో-డౌన్లను మాత్రమే ఎదుర్కొంటున్నాడని తెలుస్తోంది. అలాగే కీపింగ్ ప్రాక్టీస్ కూడా ఇంకా మొదలుపెట్టలేదని సమాచారం. గత మ్యాచ్లకు జట్టుతో ప్రయాణించని ధోనీ.. ఈ సారి హైదరాబాద్కు రావడం సానుకూల అంశమే అయినప్పటికీ.. ఆయన నేరుగా తుది జట్టులోకి వస్తాడా అన్నది సందిగ్ధంగానే ఉంది.
ధోనీ రికార్డులు .. సన్రైజర్స్ లక్ష్యం
ఐపీఎల్ చరిత్రలో 278 మ్యాచ్లు ఆడి 5,439 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న ఎంఎస్ ధోనీ.. సీఎస్కేకు వెన్నెముక వంటి వాడు. ప్రస్తుతం 5 మ్యాచ్ల్లో రెండు విజయాలతో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్.. తమ సొంత మైదానంలో గెలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు వరుస విజయాల జోరు మీదున్న చెన్నై.. ధోనీ రాకతో మరింత ఉత్సాహంగా ఉంది. మరి 44 ఏళ్ల ఈ గ్రేట్ ఫినిషర్ ఉప్పల్ స్టేడియంలో మెరుపులు మెరిపిస్తారో లేదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications