ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు కష్టాలు ముదురుతున్నాయి. ఈ సీజన్లో వరుసగా మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి పడిపోయిన ముంబై జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠ పోరులోనూ 18 పరుగుల తేడాతో పరాజయం పాలు కావడం జట్టులో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టింది. ముఖ్యంగా ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ ప్రదర్శనపై మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిలక్ వర్మకు విధ్వంసకర బ్యాటింగ్ చేసే శక్తి లేదని క్రిస్ శ్రీకాంత్ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ కేవలం 20 బంతుల్లో 53 పరుగులు చేసి మ్యాచ్ ముంబై నుంచి లాగేసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. తిలక్ వర్మ కనీసం అలాంటి ప్రభావవంతమైన ఇన్నింగ్స్ ఒక్కడి కూడా ఆడలేకపోతున్నాడని శ్రీకాంత్ విమర్శించారు.
టీ20 క్రికెట్లో నిలకడ కంటే ఇంపాక్ట్ చూపడమే ముఖ్యమని క్రిస్ శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. తిలక్ వర్మ గత రెండు మూడు సీజన్ల నుంచి ముంబైకి భారంగా మారాడని.. తిలక్ 10 మ్యాచ్ల్లో 7 మ్యాచ్ లు ఆడి తక్కువ పరుగులు చేయడం కంటే.. ఆడే 4 మ్యాచ్ల్లోనైనా జట్టును ఒంటిచేత్తో గెలిపించేలా ఆడాలని ఆయన సూచించారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో తిలక్ వర్మ కేవలం 35 పరుగులు చేయడం అతని ఫామ్ ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

చివరగా ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి క్రిస్ శ్రీకాంత్ ఓ కీలక సూచన చేశారు. 200 కంటే ఎక్కువ పరుగులు ఛేధించే సమయంలో తిలక్ వర్మ ఏ మాత్రం పనికిరాడని.. అందుకే అతడిని బ్యాటింగ్ ఆర్డర్లో ఆరు లేదా ఏడో స్థానానికి పంపాలని సూచించారు. అలా చేయడం వల్ల అతనిపై ఒత్తిడి తగ్గి స్వతంత్రంగా ఆడే అవకాశం ఉంటుందని విశ్లేషించారు. ఒకవేళ ముంబై తన బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయకపోతే.. ఈ సీజన్లో ముందడుగు వేయడం కష్టమని క్రిస్ శ్రీకాంత్ హెచ్చరించారు.