IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్కు ముందే క్రికెట్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ తదుపరి సారథిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
సంజూ శాంసన్ ట్రేడింగ్.. జట్టులోకి జడేజా
వచ్చే సీజన్ కోసం జరిగిన భారీ మార్పుల్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తమ దీర్ఘకాల కెప్టెన్ సంజూ శాంసన్ను చెన్నై సూపర్ కింగ్స్కు ట్రేడ్ చేసింది. దీనికి బదులుగా సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా, సామ్ కరణ్లను రాజస్థాన్ జట్టులోకి తీసుకుంది. సంజూ శాంసన్ నిష్క్రమణతో ఇప్పుడు రాజస్థాన్కు సమర్థుడైన నాయకుడి అవసరం ఏర్పడింది.

రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా పోస్ట్.. దళపతి హింట్
రాజస్థాన్ రాయల్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో రవీంద్ర జడేజా ఫోటోను షేర్ చేస్తూ .. దానికి "త్వరలో తళపతి" అనే క్యాప్షన్ను జోడించింది. తమిళంలో 'తళపతి' అంటే నాయకుడు లేదా కమాండర్ అని అర్థం.ఈ పోస్ట్ చూసిన అభిమానులు రవీంద్ర జడేజానే రాజస్థాన్ తదుపరి కెప్టెన్ అని ఫిక్స్ అయిపోతున్నారు.
కెప్టెన్ రేసులో ఇతర ఆటగాళ్లు
జడేజాతో పాటు జట్టులో యువ రక్తం కూడా కెప్టెన్సీ రేసులో ఉంది. రియాన్ పరాగ్ 2025 సీజన్లో వైస్ కెప్టెన్గా వ్యవహరించారు. సంజూ లేని సమయంలో జట్టును నడిపించిన అనుభవం ఉంది. భవిష్యత్తు స్టార్లుగా పరిగణించబడుతున్న యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ కూడా రేసులో ఉన్నారు.అయితే సీనియారిటీ, గత అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే జడేజాకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
జడేజాకు పాత అనుబంధం
రవీంద్ర జడేజాకు రాజస్థాన్ రాయల్స్తో విడదీయలేని అనుబంధం ఉంది. 2008 ఐపీఎల్ సీజన్లో షేన్ వార్న్ సారథ్యంలో రాజస్థాన్ టైటిల్ గెలిచినప్పుడు జడేజా ఆ జట్టులో కీలక సభ్యుడు. జడేజా ప్రతిభను గుర్తించిన వార్న్ అతడిని 'రాక్ స్టార్' అని పిలిచేవారు. సుదీర్ఘ కాలం సీఎస్కేలో ఉన్న తర్వాత, మళ్ళీ తను కెరీర్ ప్రారంభించిన జట్టుకే జడేజా కెప్టెన్గా రావడం విశేషం. ఫ్రాంచైజీ దీనిపై అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాలి. ఒకవేళ ఇదే నిజమైతే, జడేజా నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ ఎలా రాణిస్తుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.