మహీకా మాయలో హార్దిక్.. నిండాముంచిన కెప్టెన్!
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతుండటంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శల పాలవుతున్నారు. మైదానంలో బ్యాటింగ్తో కానీ, బౌలింగ్తో కానీ ప్రభావం చూపలేకపోతున్న హార్దిక్, కెప్టెన్గా కూడా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సీఎస్కేతో జరిగిన కీలక మ్యాచ్లో జట్టుకు విజయం అవసరమైన తరుణంలో, హార్దిక్ 23 బంతులు ఆడి కేవలం 18 పరుగులు మాత్రమే చేయడంతో అభిమానుల సహనం నశించింది. జట్టును ముందుండి నడిపించాల్సిన కెప్టెన్ ఇలా బాధ్యతారాహిత్యంగా ఆడటంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
మండిపడుతున్న ముంబై ఫ్యాన్స్
హార్దిక్ పాండ్యా ఆటతీరుపై మండిపడుతున్న ఫ్యాన్స్.. హార్దిక్ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు. హార్దిక్ తన గర్ల్ఫ్రెండ్ మహీకా శర్మ మాయలో పడి క్రికెట్ను పూర్తిగా గాలికొదిలేశారని నెటిజన్లు ఘాటుగా విమర్శిస్తున్నారు. దృష్టి మొత్తం ప్రేమ వ్యవహారాలపైనే ఉందని, అందుకే ప్రాక్టీస్, మ్యాచ్లపై ఏకాగ్రత దెబ్బతిందని మండిపడుతున్నారు. "ముంబై ఇండియన్స్ కోట్లాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది మ్యాచ్లు గెలవడానికా? లేక పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికా?" అంటూ కొందరు ఫ్యాన్స్ ఓపెన్గా ప్రశ్నిస్తున్నారు. అతడిని వెంటనే టీమ్ నుంచి దూరం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

వైఫల్యానికి కారణం హార్దిక్ ఒక్కడేనా?
అయితే, ముంబై ఇండియన్స్ వైఫల్యానికి కేవలం హార్దిక్ ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. రోహిత్ శర్మ గాయంతో దూరం కావడం జట్టుకు పెద్ద లోటుగా మారింది. దీనికి తోడు జట్టులో కీలకమైన సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించకపోవడం జట్టును పతనం దిశగా నడిపిస్తోంది. జట్టులో సమన్వయం లోపించడం, సీనియర్ల మధ్య ఉన్న విభేదాలు కూడా మైదానంలో కనిపిస్తున్నాయని, ఇది కేవలం ఒక్కరి తప్పిదం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే జట్టు వైఫల్యాలకు కేవలం కెప్టెన్నే బాధ్యుడిని చేయడం సరికాదని.. జట్టులోని ఇతర ప్లేయర్లు పాండ్యాకు సరైన సపోర్ట్ మద్దతు ఇవ్వడం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డాడు.
ఎవరూ అండగా నిలబడటం లేదు.. తివారీ ఆవేదన
ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మనోజ్ తివారీ.. హార్దిక్ పాండ్యా పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ఓ కెప్టెన్ సక్సెస్ కావాలంటే జట్టులోని ప్రతి ఆటగాడి నమ్మకాన్ని గెలవాలని, కానీ ప్రస్తుతం ముంబై జట్టులో హార్దిక్ పక్కన ఎవరూ నిలబడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. "హార్దిక్కు కావాల్సిన కనీస మద్దతు కూడా మైదానంలో కనిపించడం లేదు. అతడు ఒంటరిగా పోరాడుతున్నట్లు అనిపిస్తోంది. జట్టు ఓడిపోయినప్పుడు నిందలు కేవలం కెప్టెన్పైనే వేయడం సులభం, కానీ మైదానంలో నాయకుడికి అండగా ఉండాల్సిన బాధ్యత ఇతర సీనియర్ ఆటగాళ్లపై కూడా ఉంటుంది" అని తివారీ కుండబద్దలు కొట్టారు.
ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు - మురళీ కార్తీక్ విశ్లేషణ
ఇదే చర్చలో పాల్గొన్న మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్.. ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలపై ఆసక్తికర విశ్లేషణ చేశారు. ముంబైకి ఇంకా ఐదు మ్యాచ్లు మిగిలి ఉన్నాయని.. ఒకవేళ ఐదింటికి ఐదు గెలిచినా ఆ జట్టు గరిష్టంగా 14 పాయింట్లకు మాత్రమే చేరుకుంటుందని ఆయన లెక్కలు వేశారు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ రాయల్స్ జట్లు 12-13 పాయింట్లతో ముందంజలో ఉన్నాయని, ఆ జట్లు మరో రెండు మ్యాచ్లు గెలిచినా ముంబై రేసులో వెనుకబడిపోతుందని పేర్కొన్నారు. సాంకేతికంగా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 ప్రయాణం 99 శాతం ముగిసిపోయిందని ఆయన స్పష్టం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications