IPL 2026 Final: ఫైనల్ గెలిచేది ఆ జట్టే..?
IPL 2026 Final: ఐపీఎల్ 2026 మెగా ఫైనల్కు సమయం ఆసన్నమైంది. ఆదివారం(మే 31) నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ జట్టును 92 పరుగుల తేడాతో ఓడించి ఆర్సీబీ నేరుగా ఫైనల్ చేరగా.. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 7 వికెట్ల తేడాతో గెలిచి గుజరాత్ టైటాన్స్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు ఆరోన్ ఫించ్, అంబటి రాయుడులతో పాటు లక్నో సూపర్ జెయింట్స్ క్రికెట్ డైరెక్టర్ టామ్ మూడీ ఈ తుది పోరులో ఎవరు గెలుస్తారనే దానిపై తమ అంచనాలను పంచుకున్నారు.
క్వాలిఫయర్-2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ టికెట్ సాధించింది. రాజస్థాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 47 బంతుల్లో 96 పరుగులు చేసి రాజస్థాన్ను 200 పరుగుల మార్కు దాటించినప్పటికీ.. గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వీరోచిత సెంచరీ(104), సాయి సుదర్శన్ (58) రాణించడంతో గుజరాత్ చాలా సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. ఐదేళ్ల ఐపీఎల్ చరిత్ర కలిగిన గుజరాత్ ఫ్రాంచైజీకి ఇది మూడో ఫైనల్ కావడం విశేషం.

ఈ ఫైనల్ మ్యాచ్పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ, ఇరు జట్లకు గెలిచే అవకాశాలు సమానంగా (50-50) ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్లో ఆడుతుండటం వారికి లభించే అతిపెద్ద అడ్వాంటేజ్ అని, వారి టాపార్డర్ చాలా బలంగా ఉందని చెప్పాడు. అయితే ఆన్ పేపర్ చూస్తే మాత్రం ఆర్సీబీ అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తోందని, ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్ల ఫామ్ ఆర్సీబీకి ప్లస్ అవుతుందని ఆరోన్ ఫించ్ విశ్లేషించాడు.
టీమిండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు తనదైన స్టైల్లో చాలా సూటిగా.. ఒక్క ముక్కలో తేల్చేశాడు. అహ్మదాబాద్ పిచ్ స్వభావాన్ని బట్టి విజేత ఎవరనేది మారుతుందని రాయుడు చెప్పాడు. ఫైనల్ మ్యాచ్ జరిగే పిచ్ గనుక 'ఎర్ర నేల' పిచ్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని, ఒకవేళ అది 'నల్ల నేల' పిచ్ అయితే గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తుందని అంబటి రాయుడు జోస్యం చెప్పాడు.
మరోవైపు టామ్ మూడీ మాత్రం ఈ ఫైనల్లో బెంగళూరు జట్టుకే స్వల్ప ఆధిక్యం ఉందని ఓటింగ్ వేశాడు. ఆర్సీబీ సమతూకమైన జట్టు కావడమే కాకుండా, గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు తీవ్రమైన ప్రయాణాల వల్ల అలసిపోయి ఉంటారని మూడీ గుర్తుచేశాడు. గుజరాత్ జట్టు మంగళవారం ధర్మశాలలో, శుక్రవారం ముల్లాన్పూర్లో మ్యాచ్లు ఆడి, ఇప్పుడు ఆదివారం అహ్మదాబాద్లో ఫైనల్ ఆడబోతోందని.. ఈ నిరంతర ప్రయాణాల ఒత్తిడి వారిపై శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపే అవకాశం ఉందని, కాబట్టి ఆర్సీబీకే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మూడీ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications