IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలో మైదానం బయట వర్క్లోడ్ మేనేజ్మెంట్ అంశం ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కేవలం బ్యాటింగ్కే పరిమితం కావాలని.. బౌలింగ్ చేయకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా ఆంక్షలు విధించడం భారత మాజీ క్రికెటర్లకు ఆగ్రహం తెప్పించింది. ఈ నిర్ణయంపై అంబటి రాయుడు, పీయూష్ చావ్లా తమదైన స్టైల్లో స్పందిస్తూ.. విదేశీ బోర్డుల ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు.
'మా అమ్మ కూడా ఇంతలా రూల్స్ పెట్టలేదు'..అంబటి రాయుడు ఫైర్
ముంబై ఇండియన్స్, సీఎస్కే వంటి దిగ్గజ జట్లకు ఆడిన అంబటి రాయుడు క్రికెట్ ఆస్ట్రేలియా జోక్యాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. ఓ ప్రొఫెషనల్ లీగ్లో ఇలాంటి నిబంధనలు ఉండటం హాస్యాస్పదమని రాయుడు పేర్కొన్నాడు. "ఓ ఆటగాడు అత్యున్నత స్థాయి టోర్నీలో ఆడుతున్నప్పుడు.. నువ్వు ఇది చేయాలి అది చేయకూడదు అని చెప్పడం బక్వాస్. తన ఫిట్నెస్ గురించి ఆటగాడికే పూర్తి అవగాహన ఉంటుంది. మా అమ్మ నేను ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకోవాలని కోరుకునేది.. అంత మాత్రాన నా కొడుకు గాయపడకూడదని బోర్టుకు లేఖలు రాసి బౌలింగ్ చేయవద్దని చెప్పలేదు కదా!" అంటూ అంబటి రాయుడు సెటైర్లు వేశారు.

పీయూష్ చావ్లా సూటి ప్రశ్న
లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా కూడా ఈ వ్యవహారంలో ఆస్ట్రేలియా తీరును ప్రశ్నించారు. ఒకవేళ పరిస్థితి తలకిందులుగా ఉంటే ఆస్ట్రేలియా ఎలా స్పందిస్తుందో ఊహించుకోమన్నారు. "భారత ఆల్రౌండర్ ఎవరైనా ఆస్ట్రేలియాలో జరిగే బిగ్బాష్ లీగ్ ఆడటానికి వెళ్లి.. బీసీసీఐ అతను బౌలింగ్ చేయడు లేదా పరిగెత్తడు అని నిబంధన పెడితే.. వారు అతడిని జట్టులోకి తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకోరు. మరి ఐపీఎల్ విషయంలోనే ఈ వింత పోకడలు ఎందుకు?" అని పీయూష్ చావ్లా నిలదీశారు. విదేశీ లీగ్ ల విషయంలో ఒకలా.. ఐపీఎల్ విషయంలో మరోలా వ్యవహరించడం సరైనది కాదని పీయూష్ చావ్లా అభిప్రాయపడ్డాడు.
భారీగా నష్టపోతున్న ఫ్రాంచైజీలు
ఈ ఆంక్షల వల్ల ఐపీఎల్ ఫ్రాంచైజీలు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా కేకేఆర్ కామెరూన్ గ్రీన్ను రూ.25.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఓ ఆల్రౌండర్ బౌలింగ్ చేయకపోవడం వల్ల జట్టు సమతుల్యత దెబ్బతింటోందని కెప్టెన్ అజింక్య రహానే ఇప్పటికే అసహనం వ్యక్తం చేశాడు. కేవలం గ్రీన్ మాత్రమే కాకుండా.. ప్యాట్ కమిన్స్(సన్రైజర్స్ హైదరాబాద్), మిచెల్ స్టార్క్(ఢిల్లీ క్యాపిటల్స్), జోష్ హేజిల్వుడ్(ఆర్సీబీ) వంటి కీలక ప్లేయర్ల విషయంలో కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ఆంక్షలు విధిస్తుండటం ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారింది. కోట్లు కుమ్మరించి ప్లేయర్లను కొనుగోలు చేస్తే.. వారు సగం సేవలే అందించడంపై యాజమాన్యాలు గుర్రుగా ఉన్నాయి.
ప్రస్తుతం ఈ వివాదం బీసీసీఐ వర్సెస్ క్రికెట్ ఆస్ట్రేలియా అన్నట్లుగా మారింది. వర్క్లోడ్ మేనేజ్మెంట్ పేరుతో ఆటగాళ్లను నియంత్రించడం వల్ల లీగ్ నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో విదేశీ ఆటగాళ్ల ఒప్పందాల విషయంలో బీసీసీఐ కఠినమైన నిబంధనలు తీసుకువస్తుందో లేదో చూడాలి. ఏదేమైనా ఓ ప్రొఫెషనల్ లీగ్లో బోర్డుల అతి జోక్యం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమనే వాదన బలంగా వినిపిస్తోంది.