IPL 2025 RCB vs KKR: ఐపీఎల్ 2025లో భాగంగా 58వ మ్యాచ్ మే 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య సాయంత్రం 7.30 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ రెండో స్థానంలో ఉండగా.. కేకేఆర్ ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్స్కు అర్హత సాధించాలని ఆర్సీబీ భావిస్తోంది. మరోవైపు కేకేఆర్ ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ప్లేఆఫ్ రేసులో ఉండాలని కోరుకుంటోంది. కానీ ఇప్పుడు కేకేఆర్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించే ముప్పును ఎదుర్కొంటోంది.
రేపు కేకేఆర్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుందా?
నిజానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. గురువారం రోజున బెంగళూరులో భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. మ్యాచ్ జరిగే రోజున బెంగళూరులో వర్షం పడే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే రెండు జట్లకు చెరొక పాయింట్ లభిస్తుంది. ఈ క్రమంలో ఒక పాయింట్ లభించినా ఆర్సీబీ ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. అలా జరిగితే కోల్కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. కేకేఆర్ ప్లేఆఫ్ రేసులో కొనసాగాలంటే ఇప్పటి నుంచి జరగబోయే ప్రతి మ్యాచ్లో గెలిచి 2 పాయింట్లు పొందాలి.

ఐపీఎల్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడింది. అందులో అజింక్యా రహానే కెప్టెన్సీలోని కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 5 గెలిచి 6 ఓడిపోయింది. ఒక మ్యాచ్ రద్దు చేయబడింది. ప్రస్తుతం కేకేఆర్ 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
వారం రోజుల విరామం తర్వాత ప్రారంభం కానున్న ఐపీఎల్
వాస్తవానికి భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025ను ఒక వారం పాటు రద్దు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ టోర్నమెంట్ మే 17న మళ్లీ ప్రారంభమవుతుంది. వాయిదా వేయబడిన తర్వాత ఐపీఎల్ 2025 ఫైనల్ తేదీ కూడా మారింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ మే 25కి బదులుగా జూన్ 3న జరుగుతుంది. ప్లేఆఫ్స్ మే 29 నుంచి ప్రారంభమవుతాయి.