17 ఏళ్లుగా అందని ద్రాక్షగా మిగిలిన ఐపీఎల్ టైటిల్ను అందుకోవడానికి పంజాబ్ కింగ్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం ఉండటంతో కోచింగ్ సిబ్బందితో సహా జట్టును ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకుంది. బలమైన జట్టును నిర్మించి ఐపీఎల్-2025లో విజేతగా నిలవాలని పట్టుదలతో కార్యచరణ మొదలుపెట్టింది.
ఈ నేపథ్యంలో ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్ను తప్పించనుంది. బేలిస్ స్థానంలో వసీమ్ జాఫర్ను నియమించనుంది. జాఫర్ గతంలో పంజాబ్ కింగ్స్తో కలిసి పనిచేశాడు. 2021 సీజన్ వరకు జట్టుకు బ్యాటింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. కానీ గత ఐపీఎల్ మెగావేలానికి ముందు జాఫర్ను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తప్పించింది.

ఇప్పుడు ప్రధాన కోచ్గా తిరిగి జట్టులోకి ఆహ్వానించనుంది. ట్రెవర్ బేలిస్ స్థానంలో భారతీయ కోచ్నే నియమించాలనే ఉద్దేశంతో మొదట తమ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ డెవలెప్మెంట్గా ఉన్న సంజయ్ బంగర్ను ఎంపిక చేయాలని ఫ్రాంచైజీ భావించింది. కానీ వసీమ్ జాఫర్ వైపు మొగ్గుచూపించింది.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత పేలవమైన రికార్డు పంజాబ్ కింగ్స్ పేరిట ఉంది. ఇప్పటివరకు పంజాబ్ కేవలం రెండు సార్లు మాత్రమే ప్లేఆఫ్స్కు చేరింది. గత పది సీజన్లుగా లీగ్ దశలోనే ఇంటిముఖం పడుతుంది. 2014లో రన్నరప్గా నిలవడమే పంజాబ్ అత్యుత్తమ ప్రదర్శన. మూడు సీజన్లలో పాయింట్ల పట్టికలో అట్టుడగున నిలిచింది. ట్రెవర్ బేలిస్ కోచింగ్లో... 2023 సీజన్లో పంజాబ్ ఎనిమిదో స్థానం, 2024 సీజన్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
మెగావేలంతో తమ కప్ కలను సాకారం చేసే జట్టును సిద్ధం చేయాలని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం భావిస్తుంది. ఈ నేపథ్యంలో భారత యువ ఆటగాళ్లపై అవగాహన ఉండే ఇండియన్ కోచ్కు ప్రధాన బాధ్యతలు అప్పగించాలని వసీమ్ జాఫర్ పేరు పరిశీలిస్తుంది. అతని ఎంపిక దాదాపు ఖాయమే. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ ప్రాంఛైజీల్లోనూ కోచింగ్ సిబ్బందిలో మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ను తప్పించింది. గుజరాత్ టైటాన్స్ కూడా హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకితో తమ ఒప్పందాన్ని ముగించుకుంటుంది.