Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్.. అభిమానులను దారుణంగా నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో ఆరింటిలో ఓడి, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులో విఫలమైంది. దీంతో ఆ జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ మాజీ క్రికెటర్.. సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు గురించి మాట్లాడుతూ.. ధోనీ టాప్ ఆర్డర్ లో వచ్చి కనీసం 30 బంతులు ఆడితే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుతుందని పేర్కొన్నాడు. అదేంటి ధోనీ ఆడితే.. సన్రైజర్స్ కు ఛాన్స్ రావడం ఏంటి అని అనుకుంటున్నారా?
అసలు ఏం జరిగిందంటే?
ఉప్పల్ స్టేడియం వేదికగా తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై జట్టు ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచు గురించి ఓ కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు అమిత్ మిశ్రా, వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడారు. అప్పుడు సన్రైజర్స్ జట్టుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్న ఎదురైంది. అప్పుడు మిశ్రా మాట్లాడుతూ.. "దాదాపు కష్టమే. వాళ్ల ఆటతీరు చూస్తే మిగతా మ్యాచుల్లో గెలవడం చాలా కష్టం అని చెప్పొచ్చు. అన్ని విభాగాల్లోనూ వాళ్లు రాణించాలి. ఒకవేళ ధోనీ (Dhoni) బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చి కనీసం 30 బంతులు ఆడితే ఫలితం ఏమైనా మారొచ్చు." అని వ్యాఖ్యానించాడు.

రేయ్ బాబు ఏం మాట్లాడుతున్నావ్..?
దీంతో వెంటనే సెహ్వాగ్ కలగజేసుకొని.. "ఎస్ఆర్హెచ్ గురించి ప్రశ్న అడిగితే.. ధోనీ, సీఎస్కే అంటున్నావ్" అని తప్పును సరి చేశాడు. దీంతో అమిత్ మిశ్రా ప్యానల్కు క్షమాపణలు చెప్పాడు. "ధోనీ పేరు మార్మోగిపోవడం వల్లే ఇలా అనేశా" అంటూ నవ్వులు పూయించాడు. కానీ ఇదంతా లైవ్లో రికార్డ్ అవ్వడం వల్ల సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ అయింది. 'మధ్యలో ధోనీ ఎందుకొచ్చాడు', 'అతడేమైనా సన్రైజర్స్ జట్టులో ఉన్నాడా?' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఏప్రిల్ 25న శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్ - చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.