టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫుడ్ లవర్ అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆట పట్ల తనకున్న అంకితభావం, నిబద్ధతతో నోరు కట్టేసుకుని మరి కసరత్తులు చేస్తూ ఫిట్నెస్ సాధించాడు. అయితే దిల్లీకి చెందిన కోహ్లీకి అక్కడి వంటకాలంటే మహా ఇష్టం. ముఖ్యంగా చోలే బటూరే అంటే గిలగిల కొట్టేసుకుంటాడు.
అందుకే కొన్ని సందర్భాల్లో మ్యాచ్ జరిగేటప్పుడు చోలే బటూరే తింటూ ఉంటాడు. అయితే దాన్ని బ్రాడ్కాస్టర్స్ హైలైట్ చేస్తూ టీవీలో చూపిస్తుంటారు. తాజాగా ఓ కార్యక్రమంలో బ్రాడ్కాస్టర్స్ అలా చూపించడంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన తిండి విషయాలపై కాకుండా ఆట గురించి చర్చ జరపాలని సూచించాడు.

"భారత్ క్రీడా దేశంగా ఎదిగే దిశగా మేం ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకు తగ్గట్టుగా కృషి చేస్తున్నాం. మాకు ఓ విజన్ ఉంది. ప్రస్తుతం గ్రౌండ్వర్ కూడాక్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి. ఇది కేవలం మౌలిక సదుపాయాలు లేదా పెట్టుబడి పెట్టే వ్యక్తుల గురించి కాదు. ఆటను చూసే ప్రేక్షకుల గురించి. దీనిపై ప్రతిఒక్కరికీ అవగాహన రావాలి. బ్రాడ్కాస్ట్ షోలో ఆట గురించి చర్చించాలి. అంతే కానీ నిన్న నేను లంచ్ లో ఏమీ తిన్నాను, దిల్లీలో నాకు ఇష్టమైన 'చోలే బటూరే' ఎక్కడ ఉంది, అంటూ మాట్లాడాల్సిన అవసరం లేదు. క్రికెట్ మ్యాచుల్లో అవి ఉండవు కదా. మీరు ఒక అథ్లెట్ ఏం చేస్తున్నారనే విషయంపై మాట్లాడొచ్చు" అని కోహ్లీ అన్నాడు.