IPL 2025:అత్యధిక రిటైన్ ధర పలికిన టాప్-10 ప్లేయర్లు వీళ్లే!
ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిటెన్షన్ ప్లేయర్ల జాబితా గురువారం విడుదలైంది. ఆటగాళ్ల సామర్థ్యాన్ని అంచనా వేస్తూ, ఆర్థిక వ్యూహాలతో పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించింది. ఊహించినట్లుగానే కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా ఆరుగురు ప్లేయర్లను, పంజాబ్ కింగ్స్ అత్యల్పంగా ఇద్దరిని మాత్రమే అట్టిపెట్టుకుంది. ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్లోనూ సీఎస్కేలో కొనసాగనున్నాడు.
అయితే తమ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఆయా ఫ్రాంచైజీలు కనక వర్షం కురిపించాయి. మొదటి ప్రాధాన్యతకు బీసీసీఐ నిర్ణయించిన రూ.18 కోట్లు రిటైన్ ధర కంటే ఎక్కువగా కొన్ని ఫ్రాంచైజీలు చెల్లించాయి. ఐపీఎల్-2025కు సంబంధించి ప్రకటించిన పది ఫ్రాంచైజీల రిటైన్ జాబితాలో హెన్రిచ్ క్లాసెన్కు భారీ ధర దక్కింది. ఈ దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్- వికెట్ కీపర్కు సన్రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.23 కోట్లు చెల్లించింది.

అత్యధిక రిటైన్ ధర సొంతం చేసుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.21 కోట్లు ఇచ్చి తమ ఫ్రాంచైజీలో కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కోహ్లి వేలంలోకి వెళ్లని ఆటగాడిగా తన రికార్డును కొనసాగిస్తున్నాడు. కాగా, లక్నో సూపర్ జెయింట్స్ తమ వికెట్ కీపర్-హిట్టర్ నికోలస్ పూరన్కు కూడా రూ.21 కోట్లు రిటైన్ ధర నిర్ణయించింది.
సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, రాజస్థాన్ రాయల్స్ సారథి సంజు శాంసన్, బ్యాటర్ యశస్వీ జైస్వాల్, గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ రషీద్ ఖాన్, ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలు.. రూ.18 కోట్లు రిటైన్ ధర దక్కించుకున్నారు. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్లలో అత్యధిక రిటైన్ ధర పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ (రూ.5.5 కోట్లు), ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్ (రూ.5 కోట్లు) పొందారు. అన్క్యాప్డ్ ప్లేయర్లకు బీసీసీఐ కనీసం రూ.4 కోట్లుగా రిటైన్ ధర నిర్ణయించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications