ఐపీఎల్ మెగా వేలానికి వేళైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నేడు, రేపు మెగా ఆక్షన్ జరగనుంది. విదేశాల్లో వేలం జరగడం వరుసగా ఇది రెండోసారి. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. వేలంలో 577 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వాళ్లలో మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు.
మెగా వేలంలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఆక్షన్ ఆల్టైమ్ రికార్డులను పంత్ బద్దలుకొట్టే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కొందరు స్టార్ ఆటగాళ్లకు తక్కువ ధర సొంతమవుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా ఈసారి ఆల్రౌండర్లకు డిమాండ్ ఉండదని తెలుపుతున్నారు. 2027 సీజన్ వరకు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కొనసాగడమే దీనికి కారణమని అంటున్నారు.

2023 సీజన్కు సంబంధించిన వేలంలో ఆల్రౌండర్లకు భారీ ధర దక్కింది. సామ్ కరన్ను పంజాబ్ కింగ్స్ రూ.18.5 కోట్లు, కామెరూన్ గ్రీన్ను ముంబై ఇండియన్స్ రూ.17.5 కోట్లు, బెన్ స్టోక్స్ను సీఎస్కే రూ.16.25 కోట్లకు సొంతం చేసుకున్నాయి. అలాగే గత మెగా వేలంలో భారత ఆల్రౌండర్లు శార్దూల్ ఠాకూర్ (రూ.10.75 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (రూ.8.75 కోట్లు), కృనాల్ పాండ్య (రూ.8.25 కోట్లు) దీపక్ హుడా (రూ.5.75 కోట్లు) పెద్ద మొత్తాన్ని దక్కించుకున్నారు.
కానీ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కారణంగా 2023 సీజన్ నుంచి ఆల్రౌండర్లను ఆయా ఫ్రాంచైజీలు సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతున్నాయి. ఈ రూల్తో అదనపు బ్యాటర్ లేదా బౌలర్ను జట్టులోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉండటంతో ఆల్రౌండర్లను ఎక్కువగా వాడుకోలేకపోతున్నారు. ఉదాహరణకు 2021-22 సీజన్లలో సుందర్ సగటున బ్యాటింగ్-బౌలింగ్ కలిపి 25 బంతులు ఎదుర్కొంటే, 2023-24 సీజన్లలో సుందర్ సగటు 21కి పడిపోయింది.

అలాగే శార్దూల్ ఠాకూర్ను వినియోగించుకున్న సగటు 24 నుంచి 20కి, కృనాల్ పాండ్య సగటు 25 నుంచి 24కి, షాబాజ్ అహ్మద్ 19 నుంచి 15కి, మొయిన్ అలీ సగటు 29 నుంచి 17కి పడిపోయింది. దీపక్ హుడా సగటు ఏకంగా 21 నుంచి 9కి చేరింది. ఈ క్రమంలో వేలంలో నిలిచే ఆల్రౌండర్లు ఊహించినంత రీతితో రూ.కోట్లు సొంతం చేసుకోలేరు.
వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఆల్రౌండర్లు
సామ్ కరన్, గ్లెన్ మ్యాక్స్వెల్, వాషింగ్టన్ సుందర్, మార్కస్ స్టొయినిస్, లివింగ్స్టోన్, శార్దూల్ ఠాకూర్, కృనాల్ పాండ్య, విల్ జాక్స్.