IPL 2025: ఐపీఎల్ 2024 నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు భిన్నంగా కనిపిస్తోంది. ఆ జట్టు బలాన్ని బ్యాటింగ్ ఆర్డర్ ద్వారా అంచనా వేయవచ్చు. ఈ జట్టు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టు కూడా. గత సీజన్ లో సన్రైజర్స్ ఐపీఎల్ లో ఆర్సీబీపై అత్యధిక స్కోరు 287 పరుగులు చేసింది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు 300 మార్కును చేరుకోగలదని అనిపించింది. దీనిని కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కూడా ఊహించాడు. సీజన్ -18 తొలి మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 300 పరుగుల మార్కును చేరుకోగలదనే సందేశాన్ని ఇచ్చింది కానీ తర్వాత కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఆర్హెచ్ 4 మ్యాచ్ లలో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. వరుసగా 3 మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ కు ముందు అభిమానులు 300 లోడింగ్ అంటూ కామెంట్లు చేసేవారు. అంటే ఫ్యాన్స్ జట్టుపై అంతగా ఆశలు పెంచుకున్నారు. 300 స్కోరు పక్కనపెడితే అందులో సగం కూడా జట్టు చేయలేకపోతంది. కేకేఆర్ చేతిలో ఓటమి తర్వాత కావ్య మారన్ జట్టును ఇప్పుడు సోషల్ మీడియాలో ఎగతాళి చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించడంతో అక్కడ భారీ పరుగులు చేస్తున్నారని.. మిగతా స్టేడియాల్లో పిచ్, పరిస్థితులను అంచనా వేయకుండా బ్యాట్ ఊపడమే పనిగా పెట్టుకున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో జోక్గా మారిన సన్రైజర్స్ హైదరాబాద్
300 పరుగులు సాధించాలనే కలలతో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 120 పరుగులకే ఆలౌట్ అయింది. బలమైన బ్యాటింగ్ కు పేరుగాంచిన హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ లో చాలా పేలవంగా బ్యాటింగ్ చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ కూడా జట్టు విజయానికి సాయం చేయలేకపోయారు. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును సోషల్ మీడియాలో ఎగతాళి చేస్తున్నారు. మళ్లీ 300 లోడింగ్ అంటూ కామెంట్లు చేయొద్దని పేర్కొంటున్నారు.
కేకేఆర్ బౌలర్ల ముందు సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ 4 పరుగులు చేసి ఔట్ కాగా.. అభిషేక్ శర్మ 2 పరుగులు, ఇషాన్ కిషన్ 2 పరుగులు, అనికేత్ వర్మ 6 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సన్రైజర్స్ తరఫున హెన్రిచ్ క్లాసెన్ 33 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. కమిందు మెండిస్ 27 పరుగులు చేశాడు.