Pahalgam Terrorist Attack: కశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాం సమీప బైసరన్ లోయలో జరిగిన భీకర ఉగ్రదాడి ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని చిదిమేసింది. పసిపిల్లల ముందే కరడుకట్టిన ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడి మరీ చంపారు. వేడుకున్నా కనికరించకుండా, కుటుంబసభ్యుల ముందే నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసి రాక్షస ఆనందం పొందారు. ఈ ఉగ్రదాడితో భారత దేశమంతా ఉలిక్కిపడింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతిఒక్కరి హృదయాల్ని కలిచి వేసింది. ఈ క్రమంలోనే భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు కూడా.. ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మీరేం పీకలేరు రా..
తాజాగా మరోసారి భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్.. ఈ పహల్గాం ఉగ్రదాడిపై స్పందించారు. పాకిస్థాన్ పై విరుచుకుపడుతూనే లైవ్ టీవీలో ఎమోషనల్ అయ్యారు. "తమ ప్రియమైన వారిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇది మనమందరినీ (భారతీయులను) ఎంతో ప్రభావితం చేసింది. ఈ భీకర దాడి చేసిన వారికి, వాళ్లకు మద్దతు ఇచ్చిన వారికీ, వాళ్లను ఈ దాడి చేసేందుకు ప్రేరేపించినవారికి.. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ దాడుల ద్వారా మీరు సాధించిందేమిటి? గత 78 సంవత్సరాల్లో ఒక్క మిల్లీమీటర్ భూమి కూడా మన చేతులు మారింది లేదు కదా? వచ్చే 78 వేల సంవత్సరాలు అయినా కూడా మారదు. అందుకే మనం ఎందుకు శాంతిగా ఉండకూడదు? మన దేశాన్ని బలంగా తయారుచేద్దాం. ఇదే నా విజ్ఞప్తి." అని గావస్కర్ ఎమోషనల్ అయ్యారు.

మొత్తం ఎంత మంది చనిపోయారంటే
ఏప్రిల్ 22న మంగళవారం పహల్గాం భీకర దాడి జరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ముసుగు కప్పి వచ్చిన ముష్కరులు పర్యాటకులను చుట్టుముట్టి.. అతి దగ్గరి నుంచి వారిపై కాల్పులు జరిపారు. నిర్దాక్షిణ్యంగా తుపాకీ తుటాలను పురుషుల తలల్లోకి పంపారు. ఈ ఘటనలో మొత్తం 26 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు.