Shreyas Iyer: ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ అదిరే ప్రదర్శన చేస్తోంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో వరుస విజయాలను అందుకుంటూ అందరీ ప్రశంసలను అందుకుంటోంది. తమ మొదటి మ్యాచులో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించిన పంజాబ్.. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్పై కూడా గెలిచింది. 8 వికెట్ల తేడాతో గెలిచి.. ఈ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది.
ఈ రెండు విజయాల్లోనూ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ది కీలక పాత్ర. గుజరాత్ టైటాన్స్ పై 42 బంతుల్లోనే 97 పరుగులతో చెలరేగాడు. ఇక లక్నోతో జరిగిన మ్యాచులోనూ 30 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్ ప్రదర్శన చేశాడు. అయితే గత సీజన్లో కేకేఆర్కు ప్రాతిని వహించాడు శ్రేయస్ అయ్యర్. అప్పుడు ఆ జట్టుకు కెప్టెన్ గా ఉన్న అతడు.. జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించి టైటిల్ అందించాడు. కానీ కేకేఆర్ మాత్రం అతడిని పక్కకు పెట్టి వేలంలోకి వదిలేసింది. దీంతో ఆక్షన్లో శ్రేయస్ను దక్కించుకున్న పంజాబ్ కింగ్స్ ఇప్పుడు పండగ చేసుకుంటోంది. అతడి అదిరిపోయే ప్రదర్శనతో వరుస విజయాలను అందుకుంటోంది. ఈ క్రమంలోనే పలువురు క్రికెట్ అభిమానులు, మాజీలు.. కేకేఆర్ - శ్రేయస్ ను పక్కనపెట్టడంపై మరోసారి తప్పుబట్టడం ప్రారంభించారు.

అలా ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కు మద్దతుగా నిలిచాడు దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునిల్ గావస్కర్. శ్రేయస్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రేయస్ బ్యాటింగ్ నైపుణ్యాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. శ్రేయస్ అయ్యర్ పట్ల కోల్కతా నైట్ రైడర్స్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని విమర్శించాడు. 2024లో టైటిల్ గెలిచిన కేకేఆర్ జట్టుకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. కానీ నాకు తెలిసి అతడికి దక్కాల్సిన గౌరవం దక్కలేదు. గుర్తింపు కూడా రాలేదు. కేకేఆర్ విజయంలో అతడికి క్రెడిట్ దక్కలేదు. అసలు అతడి కెప్టెన్సీ రికార్డు ఎంతో గొప్పగా, ఆకట్టుకునేలా ఉంది'' అని గావస్కర్ చెప్పుకొచ్చాడు.
కాగా, ఐపీఎల్ 2015లో అరంగేట్రం చేసిన అయ్యర్.. 33.77 సగటుతో, 129.74 స్ట్రైక్ రేట్తో 3,276 పరుగులు సాధించాడు. అందులో 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యుత్తమ స్కోరు 97. 2018లో, అయ్యర్ తొలిసారిగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన అతడు.. 2020లో శ్రేయస్ ఆ జట్టును ఫైనల్స్కు చేర్చాడు. 2022లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మారాడు. 2024 సీజన్లో కోల్కతాను విజేతగా నిలిపాడు. ఇక ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ మళ్లీ అదే మ్యాజిక్ను పునరావృతం చేయాలని పలువురు అభిమానులు ఆశిస్తున్నారు.