ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్ను నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభం కానుంది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ 574 మందినే షార్ట్ లిస్ట్ చేసింది.
వాళ్లలో మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్లలో 366 మంది భారత ఆటగాళ్లు, 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నాయి. ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా ఎవరిని దక్కించుకోవాలి, భారీ మొత్తాన్ని ఎవరి కోసం వెచ్చించాలని స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.

అయితే వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్లలో రాహుల్ కోసం ఆర్సీబీ, సీఎస్కే మెగా వేలంలో తీవ్రంగా పోటీపడుతుందని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముగ్గరు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, యశ్ దయాల్ కోసం రూ.37 కోట్లు వెచ్చించింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్.. రుతురాజ్ గైక్వాడ్, మతీష పతిరనా, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ కోసం రూ.65 కోట్లు ఖర్చు పెట్టి రిటైన్ చేసుకుంది.
కాగా, ఇరు జట్లకు వికెట్ కీపర్ అవసరమవ్వడంతో కేఎల్ రాహుల్ కోసం పోటీపడతాయని గవాస్కర్ అన్నాడు. ధోనీ రిటైర్మెంట్పై స్పష్టత లేకపోవడంతో బ్యాకప్ వికెట్ కీపర్ కోసం సీఎస్కే కూడా ప్రయత్నిస్తుందని చెప్పాడు. ''రెండు దక్షిణ భారత్ ఫ్రాంచైజీలు సీఎస్కే, ఆర్సీబీ కేఎల్ రాహుల్ కోసం ప్రయత్నిస్తాయని భావిస్తున్నా. హైదరాబాద్ కూడా పోటీపడవచ్చు. అయితే బెంగళూరు రాహుల్ హోమ్ టౌన్. కాబట్టి అతను ఆర్సీబీ తరఫున ఉత్సాహంతో ఆడతాడు, సొంత అభిమానులు మధ్య ఆడాలనకుంటాడు. ఆర్సీబీ కూడా రాహుల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.