ఐపీఎల్ 2025కు వేళైంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య పోరు జరగగా.. రెండో రోజు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాజయల్స్ మధ్య జరగనుంది. దీంతో హైదరాబాద్ రాచకొండ పోలీసులు.. ఉప్పల్ స్టేడియం మ్యాచ్ కోసం భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.
2700 మంది పోలీసు సిబ్బందితో..
మొత్తంగా 2700 మంది పోలీస్ సిబ్బందిని మొహరించబోతున్నట్లు తెలిపారు. అలానే ఉప్పల్ స్టేడియంలో 450 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏసీపీ సారథ్యంలో భద్రతను పర్యవేక్షించనున్నారు. అలానే స్టేడియం ఎంట్రన్స్ దగ్గర స్నిపర్ డాగ్స్, బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేయనున్నారు. మహిళల కోసం మహిళా భద్రతా విభాగం బృందాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
అవి నిషేధం..
క్రికెట్ అభిమానుల కోసం ఐదు చోట్ల ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్ తో పాటు అగ్గిపెట్టెలు, ల్యాప్టాప్ సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించారు. అలానే ఐపీఎల్ మ్యాచ్ ఉన్న సమయంలో నగరంలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడవనున్నాయి.
